Kangana Emergency Movie UK | వివాదాస్పద బాలీవుడ్ నటి, బిజేపీ ఎంపీ కంగనా రనౌత్ రచయిత స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 1975లో భారతదేశంలో ‘ఎమర్జెన్సీ’ పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని ఆమె ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారతదేశంలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని వాయిదాలు పడుతూ వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా ఈ నెల 17న బాక్సాఫీసు వద్ద విడుదలైంది. కానీ యూకే దేశంలో కూడా ఈ సినిమా కూడా అడ్డంకులు ఎదుర్కొంటోంది. దీనిపై ఇటీవల భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.
‘‘‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని అనేక సినిమా హాళ్లలో ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారని వెలువడిన కథనాలు, నివేదికలు మా దృష్టికి వచ్చాయి. భారత వ్యతిరేక మూకల నుంచి వచ్చే బెదిరింపులు, హింసాత్మక నిరసనల వంటి అంశాలను మేం యూకే ప్రభుత్వం వద్ద లేవనెత్తుతున్నాము. ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. యూకే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. లండన్ లో ఇండియన్ హై కమిషన్ (భారత దౌత్యకార్యాలయం) ద్వారా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం’’ అని జైస్వాల్ తెలిపారు.
Also Read: 10 శాతం బ్రిటన్ ధనవంతుల వద్ద భారత్ నుంచి దోచుకున్న సంపద.. ఆక్స్ఫామ్ రిపోర్ట్
‘ఎమర్జెన్సీ’ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద మాస్కులు ధరించిన కొంతమంది ఖలిస్థానీ సానుభూతిపరులు బెదిరింపులకు పాల్పడినట్లు కథనాలు వచ్చిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.
బ్రిటన్ లోని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్ మ్యాన్ ఈ ఘటనలపై స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. “ఆదివారం నేను ప్రతినిధిగా ఉన్న నియోజకవర్గంలోని హ్యారో వ్యూ సినిమా థియేటర్లో ఎమర్జెన్సీ హిందీ మూవీ స్క్రీనింగ్ జరిగింది. థియేటర్లో సినిమా ప్రారంభమై 30 -40 నిమిషాలు అయిన తరువాత కొంతమంది ఖలిస్తానీ ఉగ్రవాదులు ముఖానికి మాస్కులు ధరించి థియేటర్ లోపలికి దూసుకొని వచ్చారు. అక్కడ ఉన్న పబ్లిక్ ని బెదిరిస్తూ బలవంతంగా సినిమా స్క్రీనింగ్ ని నిలిపివేశారు. ఈ హిందీ సినిమాకు ఇలాంటి అడ్డంకులే వోల్వర్హాంప్టన్, బర్మింగ్హామ్, మాంచెస్టర్ లలో ఎదురయ్యాయి. రెండు సినిమా హాళ్ల యజమాన్యం ఇక ఈ సినిమా స్క్రీనింగ్ చేయడం కుదరదని చెప్పేశారు.” అని తెలిపారు.
“ఈ సినిమాలోని కంటెంట్ వివాదాస్పందగా ఉందని నాకు తెలిసింది. దాని గురించి నేనేమి వ్యాఖ్యానించలేను. కానీ నా నియోజకవర్గంలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ ప్రజలు ఈ సినిమాని చూసి వారికేమైనా అభ్యంతరాలుంటే చెప్పాలి. అది వారి నిర్ణయం.” అని ఆయన అభిప్రాయపడ్డారు.
లండన్ లోని థియేటర్లలో ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకున్నది సిఖ్ ప్రెస్ అసోసియేషన్ కు చెందిన బ్రిటీష్ సిక్కులని స్థానిక మీడియా తెలిపింది. ఈ సినిమా సిక్కులకు వ్యతిరేకమని ఆ సిఖ్ ప్రెస్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అందుకే లండన్ లో సినిమా విడుదలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై లండన్ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ.. “సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని తెలసింది. అది ఒక మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని విచారణ చేశాక నిర్ణయం తీసుకుంటాం,” అని వెల్లడించారు.