ICC Anti Semitic Netanyahu| గాజాలో యుద్ధనేరాలకు పాల్పడినందుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) త్రిసభ్య ధర్మాసనం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యఓవ్ గల్లంత్ కు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. దీంతో ఐసిసిలోని 124 సభ్య దేశాలలో నెత్యన్యాహు అడుగుపెడితే ఆయనను అక్కడి ప్రభుత్వాలు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. గాజా యుద్ధంలో అమాయక పౌరులను హత్య చేసినందుకు వారి జీవితాలను నాశనం చేసినందుకు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు ఐసిసి ధర్మాసనం ఏకగ్రీవంగా ప్రకటించింది. అయితే ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఐసిసి యూదుల పట్ల వివక్ష (యాంటి సెమిటిక్) చూపుతోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఈ తీర్పు 1894లో ఫ్రెంచ్ లో జరిగిన డ్రేఫస్ కేసుతో సమానమని వ్యాఖ్యానించారు.
1894 డ్రేఫస్ కేసు
1890వ దశకంలో ఫ్రాన్స్ దేశ సైన్యంలో కెప్టెన్ గా పనిచేసిన యూదుడు ఆల్ఫ్రెడ్ డ్రేఫస్. అయితే ఆయన శత్రుదేశాలకు తమ సైనిక రహస్యాలు చేరుస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో 1894లో మిలిటరీ కోర్టు డ్రేఫస్ని ప్రజల ముందు నిలబెట్టి ఆయన మిలటరీ యూనిఫామ్ ని చించేస్తూ.. అవమానకరంగా కోర్టు మార్షల్ చేసే శిక్ష విధించింది. ఆ తరువాత ఆయనకు జీవితాంతం జైలు శిక్ష అమలు చేసింది.
అయితే రెండు సంవత్సరాల తరువాత డ్రేఫస్ నిర్దోషి అని అసలు దోషి మేజర్ ఫర్డినాన్డ్ వాల్సిన్ అని మరో విచారణ అధికారి నిరూపించాడు. అయితే అధికారులు ఆ విచారణ చేసిన డిటెక్టివ్ ని ఆఫ్రికాకు ట్రాన్స్ఫర్ చేసి.. అక్కడ బంధించారు. మరోవైపు అసుల దోసి మేజర్ ఫర్డినాన్డ్ దేశం వదిలి పారిపోయాడు. ఈ విషయాలన్నీ ప్రముఖ ఫ్రెంచ్ రచయిత ఎమిలి జోలా ఒక పుస్తకంలో రాశారు. కానీ ఆ రచయితను కూడా జైల్లో శిక్ష విధించగా.. ఆయన ఇంగ్లాండ్ దేశానికి పారిపోయాడు.
డ్రేఫస్ కేసుని ఉదహరించిన నెతన్యాహు
ప్రస్తుతం ఐసిసి ఇజ్రాయెల్ ప్రధాని, మాజీ రక్షణ మంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని నెతన్యాహు తప్పుపడుతూ 1894లో డ్రేఫస్ యూదుడు అయినందుకే అతడిని అన్యాయంగా శిక్షించారని.. ఇప్పుడు కూడా యూదులను ద్వేషించేవారున్నారని చెబుతూ.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఐసిసి యూదుల పట్ల వివక్ష చూపుతోందని వాఖ్యానించారు. ఇలాంటి అరెస్ట వారెంట్లు ఎన్ని జారీ చేసినా దేశ భద్రత కోసం తాను యుద్ధాలు చేస్తూనే ఉంటానని తనను ఎవరూ ఆపలేరని ఆయన ట్విట్టర్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు.
నెతన్యాహు అరెస్ట వారెంట్పై ప్రముఖ దేశాలు అభిప్రాయం ఇదే..
రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఐసిసిలో 124 సభ్య దేశాలున్నాయి. యుద్ధ సమయంలో అమాయక పౌరులను చంపడం, అత్యాచారం చేయడం, ఆస్పత్రులపై దాడి చేయడం వంటి మానవతా వ్యతిరేక చర్యలకు పాల్పడే యుద్ధ నేరస్తులను శిక్షించడానికే ఐసిసిని స్థాపించారు. అయితే ఐసిసికి అగ్రరాజ్యం అమెరికా గుర్తింపునివ్వలేదు. ఇజ్రాయెల్ నాయకులకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఐసిసి తప్పు చేసిందని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది. ఐసిసి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిలో అర్జెంటీనా దేశం కూడా ఒకటి.
అర్జెంటీనా అధ్యక్షుడు జావెయెర్ మిలెయి ఐసిసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ తన ఆత్మ రక్షణ కోసం ఈ యుద్ధం చేస్తోందని.. అలాంటప్పుడు ఇజ్రాయెల్ ప్రధానికి అరెస్ట్ వారెంట్ ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కానీ ఐసిసి తీర్పుని వందకు పైగా దేశాలు సమర్థిస్తున్నాయి. ఆఫ్రికాలోని 33 దేశాలు, జోర్డాన్, టునీషియా లాంటి ముస్లిం దేశాలతో పాటు స్పెయిన్, జర్మనీ, ఇటలీ, టర్కీ దేశాలు ఐసిసి నిర్ణయం పట్ల హర్షించాయి. ఇప్పటికైనా ఇజ్రాయెల్ అరాచకాలను అంతర్జాతీయ సమాజం గుర్తించిందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చెప్పారు.
తమ దేశ భూభాగంపై నెతన్యాహు అడుగుపెడితే ఆయనను అరెస్ట్ చేస్తామని స్పెయిన్, జర్మనీ దేశాలు తెలిపాయి. అయితే ఇటలీ ప్రభుత్వం మాత్రం నెతన్యాహుని అరెస్ట్ చేసి ఐసిసికి అప్పచెబుదామని.. కానీ ఐసిసి నిర్ణయాన్ని తాము సమర్థించడం లేదని తెలిపింది. ఐసిసి సభ్య దేశాల్లో అమెరికా మిత్ర దేశమైన జపాన్ కూడా ఉంది. కానీ జపాన్ ఈ అంశంపై స్పందించలేదు. గతంలో ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు పుతిన్కు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.