Ukraine Drone Attack: రష్యా, ఉక్రెయిన్ మధ్య యద్ధం ఆగిపోయే అవకాశం ఉందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో, ఉక్రెయిన్ భీకర ప్రతికారదాడులకు పాల్పడింది. సోమవారం రాత్రి రష్యా రాజధాని టార్గెట్ గా ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం కురిపించింది. మొత్తం 337 డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించిందని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఆ డ్రోన్లను తమ వైమానిక దళం సకాలంలో స్పందించి కూల్చివేసినట్లు తెలిపింది.
ఉక్రెయిన్ యాక్షన్- రష్యా కౌంటర్ యాక్షన్
ఉక్రెయిన్ నుంచి ఊహించని డ్రోన్ దాడి జరిగినప్పటికీ రష్యా కౌంటర్ యాక్షన్ కు దిగింది. ముఖ్యంగా కుర్స్క్ ప్రాంతంలో ఏకంగా 126 డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా వైమానిక దళం వెల్లడించింది. మాస్కో సమీపంలో మరో 91 డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. మరో 74 డ్రోన్లు మాస్కో సిటీ సమీపంలో కూల్చివేసినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ వెల్లడించారు. మొత్తం 337 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులు ప్రధానంగా మాస్కో, కుర్స్క్ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ జరిగినట్లు రష్యా మిలిటరీ తెలిపింది. ఈ దాడులలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయినట్లు వెల్లడించింది.
రష్యా-ఉక్రెయిన్ వార్ లో ఇదే పెద్దదాడి!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ చేసిన అతి పెద్ద డ్రోన్ దాడి ఇదేనని మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ వెల్లడించారు. ఈ డ్రోన్లు చాలా శక్తివంతమైనవని ఆయన వెల్లడించారు. రష్యా భూభాగం లోపలికి చొచ్చుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. అటు మాస్కో డొమోడీడోవ్ ప్రాంతంలోని పార్కింగ్ పై జరిగిన దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ముప్పు కలగలేదన్నారు. ఉక్రెయిన్ దాడిని రష్యా ఉరవాద చర్యగా అభివర్ణించింది.
మాస్కో గవర్నర్ కీలక ప్రకటన
ఈ దాడులపై మాస్కో గవర్నర్ ఆండ్రీ వోరోబయోవ్ కీలక ప్రకటన చేశారు. ఈ దాడిలో ఒకరు చనిపోగా ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. కిటికీలు ఊడిపోయిన శిథిలమైన అపార్ట్ మెంట్ ఫోటోను ఆయన షేర్ చేశారు. డ్రోన్ శిథిలాల వల్ల నివాస భవనంలో కనీసం ఏడు యూనిట్లు దెబ్బతిన్నాయన్నారు. క్రెమ్లిన్కు ఆగ్నేయంగా 50 కి.మీ దూరంలో ఉన్న మాస్కో ప్రాంతంలోని కొంత మంది అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వచ్చిందన్నారు. మాస్కోకు దక్షిణంగా 35 కి.మీ దూరంలో ఉన్న డొమోడెడోవో జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్ కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు. డ్రోన్ దాడుల వల్ల రైల్వే ట్రాక్లకు నష్టం వాటిల్లిందని చెప్పారు. దీని వల్ల రైల్వే సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు.
యుద్ధం ఇప్పట్లో ఆగేది కష్టమే!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడితో రష్యా- ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఈ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో సౌదీ అరేబియాలో అమెరికా అగ్ర దౌత్యవేత్త మార్కో రూబియోతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సమావేశం కావడానికి ముందే ఉక్రెయిన్ సరిహద్దు నుండి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా రాజధానిపై దాడి జరగడం అందరినీ షాక్ కి గురి చేసింది.
Read Also: పాకిస్థాన్ లో ప్రయాణికుల రైలు హైజాక్ – 100 మందికి పైగా బందీ – ఉగ్రవాదుల డిమాండ్లు ఇవే