Sam Altman Social Media App| ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఓపెన్ఏఐ (OpenAI) సంస్థ దూసుకెళ్తోంది. చాట్జీపీటీ (ChatGPT) చాట్బాట్ సేవలతో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ విభాగంలో పోటీ ఇస్తున్న మెటా కూడా తన సేవల్ని మరింత మెరుగుపరచాలని చూస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మెటా ఏఐ యాప్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగైతే తామూ ఓ సోషల్మీడియా యాప్ను తీసుకొస్తామంటూ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ (Sam Altman) పేర్కొన్నారు.
ఓపెన్ఏఐ, మైక్రోసాఫ్ట్లానే.. మెటా కూడా ఏఐ చాట్బాట్ ప్రీమియం వెర్షన్ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు సీఎన్బీసీ తన నివేదికలో వెల్లడించింది. రెండో త్రైమాసికంలో ప్రత్యేక యాప్ విడుదల చేయాలనుకుంటోందని పేర్కొంది. దీనిపై ఆల్ట్మన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ఫేస్బుక్ ఏఐ యాప్ను తీసుకురావాలని చూస్తుంటే మేం కూడా సోషల్మీడియా యాప్ను తీసుకొస్తాం. అప్పుడు ఫన్నీగా ఉంటుంది’’ అని ఆల్టమ్మన్ పేర్కొన్నారు. అయితే ప్రత్యేక ఏఐ యాప్ గురించి మెటా నుంచి మాత్రం ఎలాంటి అధికారిక స్పందన లేదు.
2023లోనే మెటా ఏఐ సేవల్ని లాంచ్ చేసింది. ఇది ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, ఇమేజ్ జెనరేషన్ సదుపాయాల్ని అందిస్తోంది. ఏఐ సేవల్ని మరింతమందికి చేరువ చేయడం కోసం తన ప్లాట్ఫామ్లైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, మెసేంజర్ సెర్చ్ బార్లలో ఈ కృత్రిమ మేధ సేవల్ని జోడించింది. మరోవైపు ఈ విభాగంలో సేవలు అందిస్తున్న ఓపెన్ఏఐ, గూగుల్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చూస్తున్నారు. అందులోభాగంగా ఏఐ మౌలిక సదుపాయాల కోసం ఈ ఏడాది 65 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. మరోవైపు మెటా రియాలిటీ ల్యాబ్స్ కింద ఏఐ ఆధారిత హ్యుమనాయిడ్ రోబోలపైనా పనిస్తోంది.
Also Read: శామ్ ఆల్ట్మన్కు మగబిడ్డ.. కానీ తండ్రి ఎవరు?
ఏఐ జపం చేస్తున్న భారతదేశ కంపెనీలు
ప్రస్తుం భారతదేశంలో కూడా చాలా కార్పొరేట్ కంపెనీలు కృత్రిమ మేధ (AI) వినియోగానికే ప్రాధాన్యతనిస్తున్నాయి, కానీ ఈ టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోగల నిపుణుల కొరత పెద్ద సమస్యగా ఉంది. లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వేలో, దేశంలోని 54% హెచ్ఆర్ నిపుణులు దరఖాస్తుదారుల్లో అవసరమైన నైపుణ్యాలు సగానికంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. సాంకేతిక నైపుణ్యాలు (61%) మరియు సాఫ్ట్ స్కిల్స్ (57%) ఉన్న అభ్యర్థులను కనుగొనడం కష్టమని వారు పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఐ, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు అరుదుగా దొరుకుతున్నారు.
ఈ కొరత కారణంగా, కంపెనీలు హైరింగ్ ప్రక్రియలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. 55% హెచ్ఆర్ నిపుణులు కనీసం 80% అర్హతలు ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తున్నారని తెలిపారు. ఏఐ సాధనాలను సృష్టించడంలో కంపెనీలు ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, వాటిని సమర్థవంతంగా ఉపయోగించగల నిపుణులు లేకపోవడం వల్ల ఈ టెక్నాలజీ యొక్క పూర్తి సామర్థ్యం చేజారిపోతోంది.
ఈ సమస్యను అధిగమించడానికి, కంపెనీలు నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణిని అనుసరించాలని సూచించారు. ఏఐ కొత్త అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్ వంటి మానవ నైపుణ్యాలు కంపెనీలను పోటీలో ముందుంచగలవని నివేదిక తెలిపింది. అదనంగా, కంపెనీలు శిక్షణ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టి, ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ టెక్నాలజీని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
ఆరోగ్య రంగంలో, ఏఐ వినియోగం 2025లో భారత జీడీపీకి 25-30 బిలియన్ డాలర్ల విలువను జతచేయగలదని డెలాయిట్ నివేదిక తెలిపింది. అయితే, డేటా భద్రత, మౌలిక సదుపాయాలు మరియు శిక్షణ పరిమితులు వంటి సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కొని, ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలవగలదని నివేదిక సూచించింది.