StarLink Pakistan Musk | ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్కు శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ‘స్టార్లింక్’ పాకిస్థాన్లో సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఈ సేవలకు అనుమతులు కావాలంటే ఎలాన్ మస్క్ క్షమాపణలు చెప్పాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది. మస్క్పై పాకిస్థాన్కు ఈ కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.
ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీస్ అనుమతి కోసం పాకిస్థాన్లో స్టార్లింక్ సంస్థ దరఖాస్తు చేసింది. ఈ అంశంపై పాకిస్థాన్ ఐటీ, టెలికమ్యూనికేషన్ సెనెట్ కమిటీ అధికారులతో చర్చించింది. కమిటీ ఛైర్మన్ పల్వాషా మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ, ‘‘ఇటీవల మస్క్ చేసిన పాకిస్థాన్ వ్యతిరేక వ్యాఖ్యలను పలువురు చట్టసభ్యులు (ఎంపీలు) తీవ్రంగా ఖండించారు. ఆయన క్షమాపణలు చెప్పాలి. ఇది అనుమతుల కోసం ముందస్తు షరతు అని మేం చెప్పట్లేదు. కానీ, చర్చల్లో ఇది ఓ అంశంగా మారింది’’ అని వ్యాఖ్యానించారు.
Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు
ఇటీవలి కాలంలో బ్రిటన్లో గ్రూమింగ్ గ్యాంగ్ల అంశం కలకలం రేపుతోంది. వీటి వెనక బ్రిటిష్ పాకిస్థానీల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎలాన్ మస్క్ కూడా ఓ వ్యాఖ్య చేశారు. 2008-2013 మధ్య పాకిస్థాన్ మూలాలు ఉన్న వ్యక్తి ఓల్డ్ హోమ్లో లైంగిక వేధింపుల గ్యాంగ్ నడిపినా, అప్పట్లో క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్గా ఉన్న ప్రస్తుత బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పట్టించుకోలేదని మస్క్ ఆరోపించారు.
గ్రూమింగ్ గ్యాంగ్ అంటే ఏమిటి?
బ్రిటన్లో నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు చిల్డ్రెన్ (NSPCC) ప్రకారం, పిల్లలు లేదా కౌమార దశలో (టీనేజర్లు) ఉన్నవారితో అనుచిత లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వారి భావోద్వేగాలను వాడుకుని వేధింపులకు గురి చేయడం బ్రిటన్ లో గ్రూమింగ్గా వ్యాఖ్యానిస్తారు. ఈ గ్రూమింగ్ చేసే క్రిమినల్స్ తరచూ గ్యాంగ్లుగా ఏర్పడి పిల్లలు లేదా టీనేజర్లను కిడ్నాప చేయడం వారిని ప్రలోభ పెట్టి ఇతర దేశాలకు అక్రమ రవణా చేసి అక్కడ వారిని విక్రయించడం లాంటి నేరాలు చేస్తున్నారు. ఈ గ్రూమింగ్ బాధితుల్లో ఎక్కువగా తెల్లజాతి పిల్లలు ముఖ్యంగా టీనేజ్ ఆడపిల్లలే ఎక్కువ.
బ్రిటన్ లోని రోథర్హామ్ పట్టణంలో 2,65,000 మంది జనాభా నివసిస్తుండగా.. అక్కడ ఒక గ్యాంగ్ టీనేజ్ పిల్లలను కిడ్నాప్ చేసి రేప్ చేయడం వారిని అక్రమ రవాణా చేయడం లాంటి ఆకృత్యాలకు పాల్పడింది. 1997 సంవత్సరం నుంచి 2014 వరకు 16 ఏళ్ల పాటు ఆ ఒక్క పట్టణంలోనే 1400 మంది టీనేజ్ బాలికలు అత్యాచారం, ఇతర లైంగిక వేధింపులకు గురయ్యారు.
ఈ క్రిమినల్ గ్యాంగ్ లలో ఎక్కువగా ఆసియా దేశాలకు చెందినవారు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆసియా గ్రూమింగ్ గ్యాంగ్స్ అని మీడియా నామకరణం చేయగా.. ఆ గ్యాంగ్ లో ఎక్కువగా బ్రిటీష్ పాకిస్తానీలే ఉండడాన్ని భారత రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎత్తిచూపారు. “గ్రూమింగ్ గ్యాంగ్ను ‘ఆసియా గ్రూమింగ్ గ్యాంగ్’ అని పిలవడం సరికాదు, పాకిస్థాన్ గ్రూమింగ్ గ్యాంగ్ అని పిలవాలి” అని సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు. ఆమె చేసిన పోస్ట్ పై సమర్థిస్తూ ఎలన్ మస్క్ కామెంట్ చేస్తూ.. “ఇది నిజం” అని రాశారు. అంటే పాకిస్తానీలు రేపిస్టులని మస్క్ బహిరంగంగా ప్రకటించినట్లే.
అందుకే పాకిస్తాన్ లో ఎలన్ మస్క్ తన స్టార్ లింక్ బిజినెస్ చేసుకోవడానికి అనుమతులు కోరితే.. ఇప్పుడు పాకిస్తాన్ ఎంపీలు ఆయనకు అడ్డుతగులుతున్నారు.