PM Modi: భారత్-అమెరికా మధ్య ట్రేడ్ టారిఫ్ వార్ కంటిన్యూ అవుతుందా? ట్రంప్ నిర్ణయం వేళ.. భారత్ ధీటుగా బదులిచ్చిందా? ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రధాని మోదీ ఎందుకన్నారు? ట్రంప్ వ్యవహారశైలిని ముందుగా గమనించారా? రాజకీయ పార్టీలు-వ్యాపార వర్గాలు ఏమంటున్నాయి? ఇదే చర్చ మొదలైంది.
దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ జయంతి నేపథ్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ట్రంప్ టారిఫ్లపై నోరువిప్పారు. అమెరికాతో వ్యాపారం, టారిఫ్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ప్రధాని.
రైతుల సంక్షేమం మాకు అత్యంత ప్రాధాన్యత అని తేల్చిచెప్పారు. మత్స్యకారులు-పాడి రైతుల ప్రయోజనాల విషయాల్లో ఎన్నటికీ రాజీ పడబోమని తేల్చిచెప్పారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంత మూల్యం చెల్లించేందుకు సిద్ధమేనని వ్యాఖ్యానించారు.
రష్యా నుండి భారీగా భారత్ చమురు కొనుగోలును కొనసాగించడం వల్ల భారతీయ వస్తువులపై సుంకాలను 50 శాతం వరకు రెట్టింపు చేసినట్టు ట్రంప్ ప్రకటించారు. ఆయన ప్రకటించిన 15 గంటల తర్వాత ప్రధాని మోదీ ధీటుగా బదులు ఇచ్చారు.
ALSO READ: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు
భారత్పై ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్. అయితే ఈ విషయంలో భారత్ మెట్టు దిగకపోవడంతో బుధవారం సాయంత్రం మరో 25 శాతం పెంచారు అధ్యక్షుడు ట్రంప్. గతంలో ప్రకటించిన 25 శాతం సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చింది.
కొత్తగా విధించిన అదనపు 25 శాతం సుంకాలు ఆగష్టు 27 నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్ ప్రకటనతో భారతీయ వస్త్రాలు, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనంగా భారం పడినట్లయ్యింది.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది ట్రంప్ సర్కార్. అమెరికా నిర్ణయాన్ని అంగీకరిస్తే దేశంలో రైతుల ప్రయోజనాలను దెబ్బ తింటాయన్నది ప్రభుత్వ ఆలోచన. సున్నితమైన అంశం కావడంతో వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను మినహాయింపునకు ససేమిరా అంటోంది భారత్.
ఈ విషయంపై ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదు. దీనిపై ఆగ్రహించిన ట్రంప్.. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోందని చెప్పి సుంకాలను రెట్టింపు చేశారు. తాజాగా ప్రధాని మోదీ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మరోవైపు ట్రంప్ టారిఫ్లపై ప్రధాని మోదీ సైలెంట్ గా ఉండటాన్ని దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. కేవలం తన మిత్రుల కోసం మెతక వైఖరిని అవలంభిస్తోందని విపక్షాలు మోదీ సర్కార్పై ముప్పేట దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నుంచి ప్రకటన వచ్చిందని కొన్ని పార్టీల నేతలు అంటున్నారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. మరోవైపు ఈనెల ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు.
🚨 The interest of our farmers is our top priority – PM Modi.
(📹-ANI) pic.twitter.com/Ru1rs9RhdT
— Indian Tech & Infra (@IndianTechGuide) August 7, 2025