US Deportees : ఆమెరికా నుంచి అక్రమ వలసదారులుగా తిరిగి భారత్ కు వచ్చిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వారికి వివిధ అక్రమ మార్గాల్లో అమెరికాకు తరలించిన ట్రావెల్ ఏజెంట్లపై హరియాణ, పంజాబ్ రాష్ట్రాల్లో పోలీసు కేసులు నమోదవుతున్నాయి. వలస వెళ్లిన బాధితులు కానీ, వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తమను మోసం చేశారని, తప్పుడు మార్గాల్లో పంపుతూ రూ.లక్షల్లో కొల్లగొట్టారనే ఆరోపణలతో ఇప్పటికే.. కొంత మంది ట్రావెల్ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు.
ఆమెరికా నుంచి బహిష్కరించిన తర్వాత దేశంలోని వచ్చిన అనేక మంది బాధితులు.. తాము ట్రావెల్ ఏజెంట్ల కారణంగానే మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధమైన దారుల్లో తమను ఆమెరికాలోకి ప్రవేశించేలా చేశారని అంటున్నారు. ఇందులో.. అత్యంత ప్రమాదకరమైన ‘డాంకీ’ మార్గాల ద్వారా అమెరికాకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఈమేరకు.. బాధితుల్లో చాలా మంది తమ నుంచి రూ.లక్షల్లో వసూలు చేసారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే.. దలేర్ సింగ్ అనే ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రావెల్ ఏజెంట్ సత్నామ్ సింగ్ పై అమృత్సర్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. హర్యానాలోని పోలీసులు ముగ్గురు ట్రావెల్ ఏజెంట్లపై మోసం, నేరపూరిత నమ్మక ఉల్లంఘన ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇటీవల అమెరికా సైనిక విమానంలో అమృత్సర్కు చేరుకున్న 104 మంది అక్రమ వలసదారులలో 33 మంది హర్యానా, గుజరాత్కు చెందిన వారు కాగా.. 30 మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. మరో ముగ్గురు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్కు చెందినవారు, ఇద్దరు చండీ గఢ్కు చెందిన వారిగా అధికారులు వెల్లడించారు. వీరంతా ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన వారే కావడం.. వీరిలాగే మరెంతో మంది అడ్డదారుల్లో అమెరికాలోకి ప్రవేశిస్తుండడంతో.. అక్కడి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలకు ప్రధాన కారణంగా ఆరోపిస్తూ.. బాధితులు ఫిర్యాదు చేస్తే.. ట్రావెంల్ ఏజెంట్లపై మోసం కేసులు నమోదు చేస్తున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారిలో మెజార్టీ సభ్యులు మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే కావడం.. వారు ఆస్తులు విక్రయించి మరీ విదేశాలకు వెళ్లిన వాళ్లు కావడంతో ఇప్పుడు వారి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వాపోతున్నారు.
చాలా మంది ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూముల్ని విక్రయించిన ఘటనలూ ఉన్నాయి. అలాగే.. ట్రావెంల్ ఏజెంట్లు తమ వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మొదట దుబాయ్కు, అక్కడి నుంచి బ్రెజిల్కు తీసుకెళ్లారని చెబుతున్న బాధితులు.. ఆ తర్వాత ‘డాంకీ’ మార్గం ద్వారా అమెరికాలోకి తీసుకెళ్లారని చెబుతున్నారు. అమెరికాలో తగిన ఉద్యోగం ఇప్పిస్తామని, అక్కడే ఉండేందుకు వసతులు చూస్తామని మోసపూరిత హామీలిస్తున్న ట్రావెల్ ఏజెంట్లు.. ఒక్కొక్క బాధితుల నుంచి సుమారుగా రూ.60 లక్షలు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.
Also Read : బైడెెన్కు ఆ సౌకర్యం అవసరం లేదు – మాజీలకిచ్చే మర్యాదను తొలగించిన ట్రంప్
అక్రమ వలసలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఏ దేశం వారైనా ఇతర దేశాలల్లోకి అక్రమంగా ప్రవేశించడం మంచిది కాదని అభిప్రాయపడింది. అమెరికా విధానాలను తప్పు పట్టాల్సిన అవసరం లేదని తేల్చింది. దాంతో.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర నుంచి సైతం మద్ధతు కొరవడిన నేపథ్యంలో.. అక్రమ మార్గాల్లో ఉద్యోగ ఆశావాహుల్ని తరలిస్తున్న ట్రావెల్ ఏజెంట్లపై కేసులు నమోదు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత మందిపై కేసులకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.