Kenya floods: కెన్యాను భారీ వర్షాలు ముంచెత్తాయి. కెన్యాలో వరదలు విధ్వంసం సృష్టించడంతో 38 మంది మృతి చెందారు. జనజీవనం పూర్తిగా స్థంబించిపోయింది. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షాలకు కారణంగా అనేక ప్రాంతాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నదుల నీరంతా నివాస ప్రాంతాల్లోకి రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లక్ష మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని అధికారులు చెబుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వీదుల్లోకి వరద నీరు ప్రవహించడంతో కొన్ని ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కిటెంగెలాలోని అథి నదికి వరదలు రావడంతో ఆ చుట్టు ప్రక్కల ఉన్న జనం వరదల్లో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తిబా నదికి వరద పోటెత్తడంతో సమీప ప్రాంతాల్లోని ఇళ్లు, వ్యాపార సంస్థల్లోకి నీరు చేరింది. ఈ నది సమీప ప్రాంతాల్లో నివాసముండే 60 కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Also Read:ఆశ్చర్యానికి గురి చేసిన యూరోప్ వాతావరణం.. నారింజ రంగులోకి మారిన ఏథెన్స్..
భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. వరదల కారణంగా ఇప్పటి వరకూ 38 మంది ప్రాణాలు కోల్పోయారని కెన్యా రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునగగా..పెద్ద ఎత్తున పశువులు మరణించాయని అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.