Spain Wildfires: వాతావరణంలో జరుగుతున్న మార్పు ఉష్ణోగ్రతలు పెరగడంతో స్పెయిన్ దేశం ప్రస్తుతం భయంకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు అంటుకుని వేలాది ఎకరాలు దగ్ధమవుతున్నాయి. తుర్కీయే, పోర్చుగల్ ఇప్పటికే మంటల బారిన పడగా ఇప్పుడు స్పెయిన్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది.
సమాచారం ప్రకారం ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా 14 చోట్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అంతేకాకుండా.. మరో 20 ప్రాంతాలకు మంటలు విస్తరిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర విభాగాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మంటల్ని అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే 3 లక్షల 90 వేల ఎకరాలకుపైగా విస్తరించిన అడవులు, పంటభూములు, పల్లెలు కార్చిచ్చులో దగ్ధమైనట్లు సమాచారం. ఇది గత రెండు దశాబ్దాలలో స్పెయిన్ చూసిన అత్యంత దారుణమైన వేసవిగా అధికారికంగా నమోదైంది. అత్యవసర విభాగాల చీఫ్ వర్జీనియా బార్కోన్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ఇంత విపరీతమైన వేడి, ఇంత విస్తారంగా మంటలు వ్యాపించడం గత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు.
Also Read: FASTag Scam: ఫాస్ట్యాగ్ కొత్త స్కామ్.. ఆ తప్పు చేశారో మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ
మంటల ప్రభావం వల్ల వేలాది మంది ప్రజలు ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. చాలామంది రహదారుల పైకి వచ్చి తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అంతేకాదు, ఈ మంటల కారణంగా వాతావరణంలో పొగలు వ్యాపించి శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆసుపత్రులు అత్యవసర విభాగాలను సిద్ధం చేశాయి. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోతే మరింత భూభాగం మంటలకు దగ్ధం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణ మార్పుల కారణంగా వచ్చిన ఈ అతివేడి, పొడి గాలులు కార్చిచ్చులకు ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. కేవలం స్పెయిన్ మాత్రమే కాకుండా యూరప్ అంతటా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మంటలు కేవలం ప్రకృతిని మాత్రమే కాక, ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నాయి. ఈ మంటలు వ్యాపించడంతో వ్యవసాయానికి పెద్ద దెబ్బ తగిలింది. పశువులు చనిపోవడం, ధాన్యం దగ్ధం కావడం రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. అదేవిధంగా పర్యాటక రంగం కూడా ఈ మంటలతో నష్టపోతుంది. ఎండాకాలంలో స్పెయిన్ను సందర్శించే వేలాది మంది పర్యాటకులు ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కి తగ్గిపోతున్నారు.
ఇక ప్రభుత్వం మాత్రం అత్యవసర చర్యలు చేపడుతూ సైన్యాన్ని, అగ్నిమాపక దళాలను రంగంలోకి దింపింది. హెలికాఫ్టర్లు, ప్రత్యేక ట్యాంకర్ల సాయంతో మంటలపై నీటిని ప్రోసుతున్నారు. కానీ పొడి గాలులు, ఎండల కారణంగా మంటలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే వాతావరణ మార్పులు మనిషికి ఎంతటి ప్రమాదకర భవిష్యత్తును తీసుకువస్తాయో స్పష్టమవుతోంది. నిపుణులు హెచ్చరిస్తూ, ఇలాంటి కార్చిచ్చులు తరచూ మరింత విస్తృతమవుతాయని, మనం ఇప్పటినుంచే పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.
స్పెయిన్లో కార్చిచ్చు
వాతావరణంలో మార్పుల కారణంగా స్పెయిన్లో దేశవ్యాప్తంగా మంటలు
ఇప్పటికే తుర్కీయే, పోర్చుగల్ మంటల బారిన పడగా.. స్పెయిన్లో కొనసాగుతున్న కార్చిచ్చు
దేశవ్యాప్తంగా 14 చోట్ల కార్చిచ్చు.. మరో 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు
మంటల కారణంగా ఇప్పటికే 3 లక్షల… pic.twitter.com/LAAIYBku6V
— BIG TV Breaking News (@bigtvtelugu) August 20, 2025