Teacher Doctors In Prostitution| ఆమె పేరు మే. ఉండేది మయాన్మార్లో 26 ఏళ్ల యువ డాక్టర్. ఏడేళ్ల పాటు కష్టపడి వైద్య విద్యను అభ్యసించి తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. నెల జీతం 415 డాలర్లు. మంచి ఆదాయం.. కలలు కన్న జీవితం.. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. 2021 ఫిబ్రవరిలో తిరుగుబాటు చేసిన మయాన్మార్ ప్రభుత్వం పౌర ప్రభుత్వాన్ని తొలగించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. నాటి నుంచీ అక్కడి వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా కూలిపోతూ వస్తున్నాయి.
మయాన్మార్ ఎన్నో సైనిక తిరుగుబాట్లను చవి చూసిన దేశం. 2011లో అక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పౌర ప్రభుత్వ అధికారాలు పాక్షికమే అయినా దేశం కోలుకునేందుకు బాటలు పడ్డాయి. మయాన్మార్ ఆర్థికంగా పుంజుకుంది. మహిళలూ ఉన్నత చదువులు అభ్యసించి తమకు నచ్చిన ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న దేశం. ఆర్థిక సంక్షోభం కరాణనృత్యం చేస్తున్న మయాన్మార్లో ప్రజలు పేదరికంలో కూరుకుపోయారు. అధికాదాయవర్గానికి చెందిన వైద్యులు, నర్సులతో పాటు టీచర్ల కూడా చేతిలో డబ్బుల్లేక, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలీక తల్లడిల్లిపోతున్నారు. కన్నబిడ్డలు ఆకలికేకల చూడలేక చివరకు మహిళా వైద్యులు, నర్సులు వ్యభిచారంలోకి దిగుతున్నారు.
Also Read: చైనాలో 200 కొత్త జైళ్ల నిర్మాణం.. ఎదిరిస్తే.. అవినీతి కేసులో లోపలికే..
వైద్యులు, నర్సులు, టీచర్లు..ఇలా ఉన్నత చదువులు చదివిన అనేక మంది మహిళలు కడుపు నింపుకునేందుకు, కుటుంబాలను పోషించుకునేందుకు మిగిలిన ఒకే ఒక దారి వ్యభిచారం. పౌరపాలనలో కాస్త కోలుకున్న మధ్యతరగతి వర్గంలో సగం మంది మళ్లీ పేదరికంలో కూరుకుపోయారు. పురుషాధిక్య సమాజంలో తరతరాలుగా అణచివేతకు గురై ఇప్పుడిప్పుడే కోలుకుటుంటున్న అక్కడి మహిళలు మళ్లీ దుర్భరపరిస్థితుల్లో కూరుకుపోతున్నారు. అత్యంత ప్రమాదకరమైన వేశ్యావృత్తిలోకి దిగుతున్నారు. మయాన్మార్లో వ్యభిచారం చట్టవిరుద్ధం. తమ గురించి బయటకు తెలిస్తే కుటుంబానికి తలవంపులు. దీంతో, మహిళలు ఏం చేయాలో పాలుపోక అలమటిస్తున్నారు. ఇక పోలీసులకు చిక్కితే సంపాదించిన దాంట్లో అధికభాగం లంచాల రూపంలో చెల్లించుకుని బయటపడాలి. పడిన కష్టం మొత్తం వృథా అయిపోతుంది.
ఇక సైనిక పాలనలో మయాన్మార్లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వరల్డ్ బ్యాంకు లెక్కల ప్రకారం, ఒకప్పటికంటే ప్రస్తుతం అక్కడి ఆర్థిక వ్యవస్థ ఏకంగా 30 శాతం మేర కుంచించుకుపోయింది. 2018లో 22.4 శాతం మంది పేదరికంలో ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు రెట్టింపై 46.3 శాతానికి చేరుకుంది. అంతర్యుద్ధం కారణంగా వాణిజ్యం దాదాపుగా స్తంభించిపోయింది. విద్య, వైద్యం వంటి కీలక రంగాలపై ప్రభుత్వ ఖర్చు బాగా తగ్గిపోయింది. ఇక వచ్చే ఏడాది మయాన్మార్ కేవలం 1 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఓ అంచనా.
ఇలా అనేక రకాల ప్రతికూలతలతో కొట్టుమిట్టాడుతున్న మహిళలు తమకు మంచిరోజులు రాకపోతాయా అన్న ఆశతో బతుకీడుస్తున్నారు. సైనిక పాలనతో విసిగిపోయిన ప్రజలు ఇప్పటికే తిరుగుబాటు ప్రారంభించారు. గ్రామీళ ప్రాంతాల్లో అధికభాగం వారి చేతుల్లోకి వెళ్లింది. నగరాలపై మాత్రం సైన్యం పట్టు కొనసాగుతోంది. సైన్యం తీరుతో పొరుగున ఉన్న చైనా కూడా విసిగిపోేయినట్టు సమాచారం. దీంతో, వివిధ వర్గాల మధ్య సయోధ్యకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి అన్నీ అనుకూలిస్తే మయాన్మార్లో శాశ్వత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి బాటలు పడొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.