Trump Travel Ban Pakistan| అమెరికా ప్రెసిడెంట్ పదవి చేపట్టిన క్షణం నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇటీవలే.. సోదర దేశాలైన పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ లకు ట్రంప్ ఊహించని షాక్నిచ్చారు. స్థానిక మీడియా ప్రకరాం.. ఈ రెండు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై ప్రవేశ నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టారిఫ్ల పేరుతో అనేక దేశాలను హెచ్చరించారు. అమెరికాలో అక్రమ వలసదారులను తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు, భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాలోకి ప్రవేశించే వివిధ దేశాల వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆఫ్గానిస్థాన్, పాకిస్థాన్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు. వచ్చే వారం నుంచి ఈ నిషేధం అమలులోకి రానున్నట్లు సమాచారం. ఉగ్రవాద చర్యలను కౌంటర్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ అధికారులు తెలిపారు.
Also Read: భారత్ పై ట్రంప్ సుంకాల ప్రభావం.. జైశంకర్ ఏమన్నారంటే..
ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి ప్రవేశించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనేక పరిశీలనల తర్వాత 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డెమోక్రాట్స్ పార్టీ సభ్యడు.. ప్రెసిడెంట్ జో బైడెన్.. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఆ దేశాల పౌరులు మళ్లీ అమెరికాలోకి ప్రవేశించడం సాధ్యమయ్యింది.
ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయుల నుంచి జాతీయ భద్రతకు ముప్పు ఉందా అన్న విషయాన్ని ముందుగానే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపై కూడా సంతకం చేశారు. దీని ప్రకారమే ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో, 2021లో కాబూల్ విమానాశ్రయంపై జరిగిన బాంబు పేలుళ్ల విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆత్మాహుతి దాడిలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోయారు. ఇప్పుడు, ఈ దాడులకు పాల్పడిన సూత్రధారిని అయిన మహమ్మద్ షరీఫుల్లా పట్టుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ సహాయం వల్లే ఈ నిందితుడిని అరెస్ట్ చేయగలిగామని కూడా వివరించారు. అంతేకాకుండా సాయం చేసినందుకు పాకిస్థాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అయితే.. పాకిస్థాన్కు కృతజ్ఞతలు చెప్పిన వెంటనే ఆ దేశ పౌరులపై బ్యాన్ విధిస్తూ ట్రంప్ అందరికీ ఆశ్చర్యపరిచారు. ఈ ద్వంద్వ విధానం రాజకీయ నిపుణులను సైతం ఆశ్చర్యచకితులను చేసింది.
ట్రంప్ ఆదేశాల ప్రకారం.. 12 సభ్యుల ఒక కమిటీ మార్చి 12లోపు ఉగ్రవాద చర్యలకు సంబంధించిన దేశాల జాబితాను సిద్ధం చేసి సమర్పించాలి. ఈ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారి ప్రయాణ ఆంక్షలు విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జాబితాలోనే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలున్నాయి.