Trump India Tariffs| భారత్-అమెరికా సంబంధాలపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, కానీ ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని ఆయన తెలిపారు. ఇదే భారత్తో ఉన్న ఏకైక సమస్య అని ఆయన అన్నారు. ఇటీవల ఆయన ఒక అమెరికా న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ సుంకాలను తగ్గిస్తుందని ఆయన ఆశించారు. ఒకవేళ భారత్ సుంకాలు తగ్గించకపోతే ఏప్రిల్ 2 నుంచి ఇండియా కూడా ప్రతీకార సుంకాలు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. ఇండియా-పశ్చిమ ఆసియా-యూరప్ ఆర్థిక కారిడార్ గురించి ట్రంప్ స్పందిస్తూ, ఇది గొప్ప దేశాల సమూహం అని ప్రశంసించారు. ఈ కారిడార్ యుఎస్ వాణిజ్యానికి హాని కలిగించాలనుకునే దేశాలను ఎదుర్కొంటుందని ఆయన నొక్కి చెప్పారు.
తమకు శక్తివంతమైన వాణిజ్య భాగస్వాముల సమూహం ఉందని, వారు ఎప్పటికీ చెడుగా ప్రవర్తించలేరని ఆయన తెలిపారు. స్నేహితులతో పోలిస్తే శత్రువులతోనే చాలా విధాలుగా మెరుగ్గా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. అయితే దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని.. కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని భారత్ సమాధానం చెప్పింది. దీంతో మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read: భారత్లో అమెరికా రహస్య స్థావరాలు.. కెన్నడీ ఫైల్స్లో గూఢాచారం కీలక సమాచారం
యూరోప్ దేశాలను హెచ్చరించిన ట్రంప్
అమెరికా, యూరోప్ దేశాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతోంది. మరిన్ని వస్తువులపై సుంకాలు విధించేందుకు రెండు వర్గాలు సిద్ధమయ్యాయి. కొన్ని రోజుల క్రితం అమెరికా విస్కీపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) సుంకాలు విధించడంతో అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యూరోప్ నుంచి వచ్చే వైన్పై 200 శాతం ప్రతీకార సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. ‘వాళ్లు మా దగ్గర ఎంత వసూలు చేస్తే, మేమూ అంతే వసూలు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. యురోప్ దేశాల ఉత్పత్తులపై మరిన్ని సుంకాలు విధించి.. ప్రపంచంలో వాణిజ్య యుద్ధానికి తెరలేపుతామని హెచ్చరించారు. ఇక, త్వరలోనే ఈయు నుంచి వచ్చే రాగిపై కూడా సుంకాలు విధించనున్నట్లు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. మరోవైపు, ఈ సుంకాల అంశంపై సీరియస్గా చర్చలు జరపాలని చైనా సూచించింది.
అమెరికా విస్కీపై ఈయూ డ్యూటీలను అమలు చేస్తే, అక్కడి నుంచి వచ్చే వైన్, షాంపేన్, స్పిరిట్ పై 200 శాతం సుంకాలను విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఈయూ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పన్నులుండే అథారిటీ. అమెరికా నుంచి లాభం పొందడానికే ఇది ఏర్పడింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధించిన అమెరికాపై కెనడా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా నుంచి వచ్చే పరికరాలు, కంప్యూటర్లు, సర్వర్లు, మానిటర్లు, క్రీడా పరికరాలు, దుక్క ఇనుముపై 25 శాతం ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికాతో సుంకాల వివాదం నెలకొన్న నేపథ్యంలో జీ-7 దేశాల దౌత్యవేత్తలు గురువారం కెనడాలో కలిశారు. యురోప్ వైన్పై 200 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన వెంటనే ఈ సమావేశం జరగడం విశేషం.