Russia Ukraine Attack| ఉక్రెయిన్ ఆదివారం రష్యా సైనిక ఎయిర్బేస్లపై పెద్ద ఎత్తున డ్రోన్ దాడి చేసింది. ఇరు దేశాల సైనికులు తలపుడుతన్న వార్ ఫ్రంట్ లైన్కు వేల కిలోమీటర్ల దూరంలో రష్యా భూభాగంలో జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ దాడిని “అద్భుతమైన” ఆపరేషన్గా పేర్కొన్నారు. ఈ దాడి రష్యాకు గణనీయమైన నష్టాన్ని కలిగించిందని, ఇది “న్యాయమైనది, సముచితమైనది “గా అని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ఈ ఆపరేషన్కు “స్పైడర్స్ వెబ్” అని పేరు పెట్టింది.
జెలెన్స్కీ ప్రకారం.. ఈ దాడిలో 117 డ్రోన్లను ఉపయోగించారు, ఇందులో అనేక మంది డ్రోన్ ఆపరేటర్లు పాల్గొన్నారు. రష్యా భూభాగంలోని ఎయిర్బేస్లలో ఉన్న వ్యూహాత్మక క్రూయిజ్ మిసైల్ క్యారియర్లు లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. “మా బృందం రష్యాలోని వివిధ ప్రాంతాలలో, మూడు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసింది. ఈ ఆపరేషన్కు ఒకటిన్నర సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. ప్రణాళిక, సంస్థాగతం, ప్రతి వివరం కచ్చితంగా అమలు చేయబడింది. ఇది నిజంగా ఒక అసాధారణ ఆపరేషన్,” అని జెలెన్స్కీ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
“ఒకటిన్నర సంవత్సరాల క్రితం నేను అనుమతించిన ఈ ఆపరేషన్ ఫలితాన్ని చూడటం సంతృప్తికరంగా ఉంది. ఈ దాడిలో రష్యాకు చెందిన 40 కంటే ఎక్కువ మిలిటరీ విమానాలను నాశనం చేయడం జరిగింది. మేము ఈ పనిని కొనసాగిస్తాము,” అని ఆయన చెప్పారు.
ఈ ఆపరేషన్ ని సమర్థవంతంగా ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చేపట్టింది. ఒకటిన్నర సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ప్రణాళికలో ఉందని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ కు చెందిన అధికారులు మీడియాకు తెలిపారు. ఈ ఆపరేషన్ను జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించగా.. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చీఫ్ వాసిల్ మలియుక్, అతని బృందం దీనిని అమలు చేసింది.
ప్లానింగ్ ఎలా చేశారంటే..
ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అధికారుల ప్రకారం.. ఈ ఆపరేషన్ నిర్వహించడంలో రవాణా సదుపాయం పెద్ద సవాలుగా మారింది. మొదట, FPV డ్రోన్లను రష్యా భూభాగంలోకి రహస్యంగా చెక్కతో తయారు చేసిన కేబిన్ లో తీసుకెళ్లారు. రష్యాలోకి చేరిన తర్వాత, ఈ డ్రోన్లను క్యాబిన్ల పైకప్పుల కింద దాచారు, వీటిని కార్గో ట్రక్కులపై ఉంచారు. నిర్ణీత సమయంలో, ఈ క్యాబిన్ల పైకప్పులను రిమోట్గా తెరిచి, రష్యన్ బాంబర్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ప్రయోగించారు.
ఈ చారిత్రాత్మక మిషన్లో పాల్గొన్న అందరూ ఇప్పటికే ఉక్రెయిన్కు తిరిగి వచ్చారని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. అందువల్ల, రష్యా అధ్యక్షుడు పుతిన్ బృందం చేసే ఏవైనా అరెస్ట్లు కేవలం రష్యా ప్రజల కోసం నాటకీయ ప్రదర్శన మాత్రమేనని వారు అన్నారు.
జెలెన్స్కీ ప్రకారం.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ కోరుకుంటోంది. ఈ మేరకు ప్రతిపాదన కూడా చేసింది. “మేము ఈ యుద్ధాన్ని ఒక్క క్షణం కూడా కోరుకోలేదు. మార్చి 11 నుండి, అమెరికా పూర్తి షరతులు లేని ఆయుధ విరమణ ప్రతిపాదనను రష్యా ముందు ప్రస్తావించింది. రష్యన్లు యుద్ధాన్ని కొనసాగించాలని ఎంచుకున్నారు. రష్యాపై ఆంక్షలు, ఒత్తిడి ఇప్పుడు నిజంగా అవసరం. సైనిక చర్యలు, దౌత్యం ద్వారా ఒత్తిడి చేస్తున్నాం” అని ఆయన అన్నారు.
ఈ దాడి, ఇస్తాంబుల్లో జరగనున్న శాంతి చర్చలకు ఒక రోజు ముందు జరిగింది. ఈ దాడులు రష్యాలోని సైబీరియాలోని బెలయా, ఆర్కిటిక్లోని ఒలెన్యా, మాస్కోకు తూర్పున ఉన్న ఇవానోవో, డయాగిలెవో ఎయిర్బేస్లను లక్ష్యంగా సాగాయి.
Also Read: ట్రంప్ హోటల్స్లో పెట్టుబడులు అంతా ఫ్రాడ్.. భారతీయులకు కోట్లలో నష్టం
ఆదివారం, ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యా ప్రాంతాలలో రెండు వంతెనలు కూలిపోయాయి, రైళ్లు పట్టాలు ధ్వంసమయ్యాయి. కనీసం ఏడుగురు మరణించారు. వంతెనలు కూలిపోవడానికి “పేలుళ్లు” కారణమని రష్యా దర్యాప్తు సంస్థలు అధికారికరంగా వెల్లడించాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ, యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుతున్నారు.