United Nations Security Council: హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత 8 నెలలుగా బీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోరుకు ముగింపు పలకాలన్న ఉద్దేశంతో తెరపైకి తీసుకొచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికకు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సోమవారం ఆమోదం తెలిపింది. అమెరికా ప్రతిపాదించినటువంటి ఈ తీర్మానానికి మండలిలోని 15 సభ్య దేశాల్లో 14 దేశాలు ఆమోదం తెలిపాయి. రష్యా మాత్రం ఓటింగ్ కు గైర్హాజరైంది. మూడు దశలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇజ్రాయెల్, హమాస్ లు తక్షణం అమలు చేయాలని ఈ తీర్మానం కోరింది. ఈ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గత నెలలో ప్రకటించారు.
కాల్పుల విరమణకు, యుద్ధానంతరం గాజా పాలనకు సంబంధించిన ప్రణాళికలకు మద్దతు కూడగట్టేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశం అయ్యారు. కాల్పుల విరమణ ప్రతిపాదన రావాల్సి ఉందని అన్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం ఉందని అమెరికా చెబుతున్నది. అయితే, అందులోని పలు అంశాలను నెతన్యాహు బహిరంగంగానే వ్యతిరేకించారు. హమాస్ ను అంతమొందించడానికే తాము ఇప్పటికే కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. సంధి ప్రయత్నాలపై హమాస్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందనైతే రాలేదు. భద్రతా మండలి తాజా తీర్మానాన్ని ఆ ముఠా స్వాగతించింది. కాల్పుల విరమణ అమలవుతుందన్న భరోసా తమకు ఉండాలంటూ స్పష్టం చేసింది. కొన్ని అంశాలపై స్పష్టత కావాలని, ఈ పోరుకు శాశ్వత ముగింపు పలకాలని తెలిపింది.
Also Read: ఎన్నికల వేళ.. బైడెన్కు ఊహించని షాక్, దోషిగా తేలిన కొడుకు హంటర్
అమెరికా – ఇజ్రాయెలీ గూఢచర్య నెట్ వర్క్ ను తాము భగ్నం చేసినట్లు యెమెన్ లో హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అయితే, కొద్దిరోజుల కిందట ఐక్య రాజ్య సమితి సిబ్బంది, దాతృత్వ సంస్థల సిబ్బందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
దక్షిణ గాజాలోని రఫాలో జరిగినటువంటి ఒక పేలుడులో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షాలిత్ అపహరణలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది ఓ భవనంలో ఉన్నాడంటూ సమాచారం అందడంతో ఆ భవనాన్ని పేల్చివేసేందుకు నెతన్యాహు సేన సిద్ధమైంది. అయితే, వారి వద్ద ఉన్నటువంటి పేలుడు పదార్థాలు ముందుగానే పేలడంతో నలుగురు సైనికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.