US Houthi War Plans Leaked Jeffrey Goldberg | అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం పెద్ద బ్లండర్ చేసేసింది. అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ అధికారుల వల్ల జరిగిన నిర్లక్ష్యం అగ్రరాజ్యంలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హౌతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా యెమెన్ దేశంపై ఇటీవల అమెరికా దాడులు చేస్తోంది. ఈ యుద్ధ ప్రణాళికను పొరపాటున మీడియాకు ముందే లీక్ అయ్యాయి. రహస్యంగా ఉండాల్సిన యుద్ధ ప్రణాళికను వైట్ హౌస్ అధికారులు తెలియకుండానే ఒక జర్నలిస్టుతో పంచుకోవడం ఈ వివాదానికి కారణం. ఈ సమాచారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన చేసే ముందే బహిర్గతమైందని తేలడంతో ఇప్పుడు ట్రంప్ యంత్రాంగంపై ప్రతిపక్ష నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తదితర ప్రముఖలు ఉన్న సిగ్నల్ గ్రూప్ (వాట్సాప్ లాంటిది) అనే చాట్లోకి జెఫ్రీ గోల్డ్బర్గ్ అనే ఒక జర్నలిస్టుకు పొరపాటున సభ్యుడిగా చేశారు. అయితే ఈ గ్రూప్లో యెమెన్ పై యుద్ధ ప్రణాళికలను చర్చించుకున్నారు. ‘ది అట్లాంటిక్’ మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ అయిన జెఫ్రీ గోల్డ్బర్గ్ ఈ విషయం బహిర్గతం చేశారు.
మార్చి 15న ట్రంప్ యెమెన్ పై దాడులను అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ ప్రకటనకు ముందే జెఫ్రీకి సిగ్నల్ గ్రూప్ ద్వారా ఈ సమాచారం లభించింది. ఈ ఘటన జరిగే రెండు రోజుల ముందే అతడిని ఆ గ్రూప్లోకి చేర్చారు. అయితే, జెఫ్రీ ఈ సమాచారాన్ని ప్రచురించలేదు.
Also Read: చదువుకునేందుకు అమెరికా వెళ్లడం ఇక కష్టమే – ఈ లెక్కలు చూస్తే మీకే అర్థం అవుతుంది
జెఫ్రీ ప్రకటన తర్వాత వైట్ హౌస్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించుకున్నారు. సోమవారం వైట్ హౌస్ ప్రతినిధులు ఇది తమ వల్ల జరిగిన పొరపాటు అని అంగీకరించారు. కానీ ఈ చర్చలో నిర్దిష్ట దాడుల ప్రణాళికలు గురించి సమాచారం లేదని చెప్పారు. ఈ సంఘటన ఇప్పుడు అమెరికా రాజధాని వాషింగ్టన్లో పెద్ద వివాదాన్ని రేకెత్తించింది.
డెమోక్రాట్లు ఇది గంభీరమైన భద్రతా లోపమని నొక్కి చెబుతున్నారు. ట్రంప్ పరిపాలనలో జాతీయ భద్రతపై నిర్లక్ష్యం పెరుగుతోందని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే.. యెమెన్లోని హౌతీ తిరుగుబాటు దళాలు అమెరికన్ నౌకలు, విమానాలపై దాడులు చేసినందుకు ప్రతీకారంగా ట్రంప్ ప్రభుత్వం సైనిక చర్యలు ప్రారంభించింది. “హౌతీలకు ఇదే హెచ్చరిక! మీ సమయం ముగిసింది. మీ దాడులు వెంటనే ఆపండి. లేకపోతే ఊహించని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది” అని ట్రంప్ హెచ్చరించారు. హౌతీలకు మద్దతు ఇచ్చే ఇరాన్కు కూడా ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
మార్చి 15-16 నుంచి యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. హౌతీల రాజకీయ బ్యూరో ఈ దాడులను యుద్ధ నేరాలుగా నిందిస్తూ, యెమెన్ సైనిక దళాలు ధీటుగా ప్రతిఘటిస్తున్నాయని తెలిపింది.