US Travel Advisory Pakistan | పాకిస్థాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్కు వెళ్లకూడదని తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని, టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.
అమెరికా తన దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్లో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, వీలైనంత వరకు ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదని పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో, పాకిస్థాన్కు వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే, భారత సరిహద్దు ప్రాంతాలు.. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా (khyber Pakhtunqwa).. ప్రావిన్స్ కు అస్సలు వెళ్లకూడదని హెచ్చరించింది. ఆ ప్రావిన్స్లలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. పాకిస్థాన్కు వెళ్లేవారు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
Also Read: భారత్ పై ట్రంప్ సుంకాల ప్రభావం.. జైశంకర్ ఏమన్నారంటే.
అలాగే.. మార్కెట్లు, రవాణా కేంద్రాలు, ఇతర ప్రాంతాలలో పౌరులు, పోలీసులు, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు, పాకిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందుగా వీసా తీసుకున్న తర్వాతే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.
ఇంతలో, పాకిస్థాన్ పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భద్రతా కారణాలతో, పాకిస్థాన్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్లు సమాచారం. ఇక, డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి ప్రవేశించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ కు ధన్యవాదాలు తెలుపుతూనే ప్రయాణ నిషేధం విధించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై ప్రవేశ నిషేధం విధించారు. భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ అధికారులు తెలిపారు.
ట్రంప్ మొదటి పదవీకాలంలో కొన్ని ముస్లిం దేశాల పౌరులపై ప్రవేశ నిషేధం విధించారు, కానీ తర్వాత జో బైడెన్ ఈ నిర్ణయాన్ని రద్దు చేశారు. ఇప్పుడు, ట్రంప్ మళ్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2021లో కాబూల్ విమానాశ్రయంపై జరిగిన బాంబు దాడికి సంబంధించిన నిందితుడిని పట్టుకున్నందుకు పాకిస్థాన్కు కృతజ్ఞతలు తెలిపినప్పటికీ, ఆ దేశ పౌరులపై నిషేధం విధించడం రాజకీయ నిపుణులను ఆశ్చర్యపరిచింది.
ట్రంప్ ఆదేశాల ప్రకారం.. 12 సభ్యుల కమిటీ ఉగ్రవాద ప్రమాదం ఉన్న దేశాల జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ జాబితాలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై ప్రయాణ ఆంక్షలు విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.