Weather News: గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే వర్షాలు దంచికొడుతున్నాయి. సాయంత్రం, రాత్రివేళల్లో నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు నగరవాసులు, ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు అయితే ట్రాఫిక్ లో చిక్కుకుని గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను అప్డేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది.
రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు
ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ALSO READ: SCR Updates: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖ రైళ్లు తిరిగి అసలు రూట్లోకి!
ఈ జోన్లు మునిగిపోయే అవకాశం..
ఈ నెల 17 వరకు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చార్మినార్ జోన్, ఎల్బీ నగర్ జోన్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించింది. ఈ జోన్లు మునిగిపోయే అవకాశం ఉండడంతో ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
ALSO READ: Trains In Telangana: ఆ రైళ్లన్నీ ఇక సికింద్రాబాద్ నుంచే, రైల్వే అధికారుల కీలక ప్రకటన!
40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
ముఖ్యంగా ఈ జోన్లలో ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆగస్టు 15, 16, 17 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ మూడు రోజుల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ జోన్లకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. అక్కడక్కడ పిడుగుల పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
భాగ్యనగర వాసులు జర జాగ్రత్త..!
భారీ వర్షాల నేపథ్యంలో భాగ్యనగర వాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. భారీ వరదలు వచ్చే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.