Mahesh Kumar Goud: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీరుపై, ఆ పార్టీ జాతీయ నాయకత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల వేళ మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే బీజేపీ తన జాతీయ నాయకులను తెలంగాణకు తీసుకొస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని, కేవలం దేవుళ్ల పేర్లు జపించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తే ఇక్కడ చెల్లదని ఆయన హెచ్చరించారు.
బీజేపీ కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్ను కలిసి ‘భిక్షం దేహి’ అని వేడుకోవడం వారి దీనావస్థకు నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రా నాయకుడని, ఆయన చెబితే తెలంగాణ ప్రజలు ఓటేయరని ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణను కించపరిచిన పవన్ ఒక “తెలంగాణ వ్యతిరేకి” అని, ఆయనను “దిష్టి కళ్యాణ్”గా అభివర్ణించారు. పవన్ తన రాజకీయం ఆంధ్రాకే పరిమితం చేసుకోవాలని మహేష్ గౌడ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఆర్థికంగా దేశానికి వెన్నుముకగా నిలుస్తున్నప్పటికీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి మొండిచేయి చూపుతోందని మహేష్ కుమార్ గౌడ్ గణాంకాలతో వివరించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.01% గా ఉందని, పన్నుల వసూళ్లలో రాష్ట్రం ముందువరుసలో ఉన్నప్పటికీ నిధుల మంజూరులో మాత్రం తీవ్ర వివక్ష ఎదురవుతోందని మండిపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో జీఎస్టీ ద్వారా తెలంగాణ 4.33 లక్షల కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లిస్తే, తిరిగి వచ్చింది కేవలం 3.76 లక్షల కోట్లు మాత్రమేనని, అందులో కూడా దాదాపు 30 శాతం కోత విధించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కష్టపడి కట్టిన పన్నులను గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు తరలిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం చూపిస్తున్న ఈ వివక్ష భవిష్యత్తులో దేశ సమగ్రతకు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీకి చెందిన ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు, ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా తీసుకురాలేకపోయారని ఆయన విమర్శించారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు వంటి కీలక అంశాలను కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మెట్రో రైలు, మూసీ ప్రాజెక్టు, బయోఫార్మా, సెమీకండక్టర్ పరిశ్రమల వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. అబిడ్స్ సెంటర్లో బహిరంగ చర్చకు సిద్ధమని, బీజేపీ నేతలు తెలంగాణకు ఏం తెచ్చారో నిరూపించాలని సవాలు విసిరారు.
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా ప్రజల్లోకి వెళ్తోందని స్పష్టం చేశారు. కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల్లో జనరల్ సీట్లలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి 40 శాతం కోటాను అధిగమిస్తామని హామీ ఇచ్చారు. ఇది ముఖ్యమంత్రి, పార్టీ ఇచ్చిన నిబద్ధత అని పేర్కొన్నారు. పొత్తుల విషయంలో సిపిఐ, టిజిఎస్ మాకు మిత్రపక్షాలని, కొన్ని చోట్ల స్థానిక పరిస్థితులను బట్టి ఫ్రెండ్లీ ఫైట్ ఉండొచ్చని, కానీ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలతో తమకు ఎలాంటి పొత్తు లేదని తేల్చి చెప్పారు. ప్రజలు వివేచనతో ఆలోచించి, తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, బీజేపీ విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.