Mosquitoes Kill Mosquitoes| వర్షాకాలం, వేసవి సీజన్లు రాగానే దోమలు విపరీతంగా పెరిగిపోతాయి. అడవి లేదా ఎక్కువగా చెట్లు ఉన్న ప్రాంతాల్లో అయితే దోమల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. దోమల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అందుకే దోమల సమస్య నివారణకు లిక్విడ్ రెపెలెంట్స్, బత్తీలు, మస్కిటో క్రీమ్స్ ఎన్నో ఉన్నాయి. అయితే బలమైన అడవి దోమలకు ఈ నివారణ మార్గాలు పనిచేయక ఒక నగర ప్రజలు తెగ ఇబ్బందిపడుతుండగా.. తాజాగా అక్కడి ప్రభుత్వం ఒక ప్రయోగాత్మక కార్యక్రమం చేపట్టింది. అదే అడవి దోమల సంఖ్యను తగ్గించే స్పెషల్ దోమలు.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా అడవి దోమల బెడద మరీ తీవ్రంగా ఉంది. అందుకే దోమల సంఖ్యను తగ్గించేందుకు స్థానిక ప్రభుత్వం కొత్త ప్రయోగం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రయోగశాలలో పెంచిన సుమారు 6 లక్షల మగ దోమలను విడుదల చేస్తున్నారు. కెమికల్స్ ఉపయోగించకుండా సహజ పద్ధతిలో దోమల పెరుగుదలను తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
విడుదల చేస్తున్న మగ దోమల్లో వోల్బాచియా అనే సహజ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మగ దోమలు అడవిలో ఉన్న ఆడ దోమలతో జతకట్టినప్పుడు, వాటి గుడ్లు అభివృద్ధి చెందకుండా ఆగిపోతాయి. ఫలితంగా కొత్త దోమలు పుట్టకుండా దోమల జనాభా క్రమంగా తగ్గుతుంది.
ఈ కార్యక్రమంలో విడుదల చేస్తున్నవి కేవలం మగ దోమలే కావడంతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మగ దోమలు మనుషులను లేదా జంతువులను కరవవు (Non Biting Mosquitoes). అవి మొక్కల పుష్పరసాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. రక్తాన్ని పీల్చేది కేవలం ఆడ దోమలే.
వాషింగ్టన్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మేరీల్యాండ్లోని సిల్వర్ స్ప్రింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘బీ సేఫ్ మస్కిటో కంట్రోల్’ కంపెనీ నిర్వహిస్తోంది. అమెరికాలో నేరుగా ఇళ్ల యజమానులకు ఈ సర్వీస్ అందిస్తున్న తొలి ప్రైవేట్ కంపెనీ ఇదే. ప్రస్తుతం వాషింగ్టన్ డీసీతో పాటు సమీప మేరీల్యాండ్ ప్రాంతాల్లో సుమారు 25 ఇళ్లలో ఈ సేవ అందిస్తోంది.
వేసవి కాలంలో ప్రతి ఇంటి వెనుక భాగంలో వారానికి సుమారు 1,500 మగ దోమలను విడుదల చేస్తున్నారు. ఇలా నిరంతరం విడుదల చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో దోమల సంఖ్య క్రమంగా తగ్గుతుందని సంస్థ చెబుతోంది.
ఈ దోమలను కెంటకీ రాష్ట్రంలోని మస్కిటోమేట్ కంపెనీ సరఫరా చేస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ అభివృద్ధి చేసిన టెక్నాలజీతో నియంత్రిత వాతావరణంలో వోల్బాచియా బ్యాక్టీరియాతో ఈ దోమలను పెంచుతున్నారు. ఇది చాలా సురక్షిత విధానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పురుగులను చంపే కెమికల్ మందులు తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి ఉపయోగకరమైన జీవులపై కూడా ప్రభావం చూపుతాయి. కానీ వోల్బాచియా ఉన్న మగ దోమల పద్ధతి కేవలం దోమల జనాభాపై మాత్రమే ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇది పర్యావరణానికి అనుకూలమైన పరిష్కారంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సింగపూర్లో ఇప్పటికే కోట్ల సంఖ్యలో వోల్బాచియా ఉన్న మగ దోమలను విడుదల చేశారు. అక్కడ దోమల సంఖ్య కొన్ని ప్రాంతాల్లో 90 శాతం వరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. 2026 నాటికి ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని సింగపూర్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
Also Read: ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం
ఈ టెక్నాలజీపై అమెరికాలో కూడా ఆసక్తి పెరుగుతోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతులు కోరుతోంది. డెంగ్యూ, జికా, వెస్ట్ నైల్ వైరస్ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను తగ్గించడం దీని లక్ష్యం.
ప్రస్తుతం ఉత్పత్తి ఖర్చులు, ప్రభుత్వ నిబంధనలు, నిర్వహణ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఈ విధానం మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వాతావరణ మార్పులతో దోమల పెరుగుదల పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి సహజ టెక్నాలజీలు, ప్రజారోగ్య రక్షణలో కీలక పాత్ర పోషించవచ్చని చెబుతున్నారు.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు