పానీపూరిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, నూటికి 99 శాతం పానీపూరి బండ్ల దగ్గగ అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. అయినప్పటికీ చాలా అవేమీ పట్టించుకోకుండా లాగించేస్తుంటారు. అలా తినడం ఎంతడేంజరో తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటనను చూస్తే అర్థం అవుతుంది. రోడ్డు పక్కన అమ్మే కలుషితమైన పానీపూరీ తినడం వల్ల తీవ్రమైన హెపటైటిస్ A ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు ఓ 22 ఏళ్ల యువకుడు. ఏకంగా నెల రోజుల పాటు మంచానికే పరిమితం అయ్యాడు.
తాజాగా ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడు రోడ్ సైడ్ పానీపూరి తిన్నాడు. తిన్నాక కొద్ది రోజుల తర్వాత కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారింది.కడుపులో అసౌకర్యం, వికారం, వాంతులు, బలహీనత, ముదురు రంగు మూత్రం రావడం మొదలుపెట్టింది. వెంటనే అతడు హాస్పిటల్ లో చేరాడు. డాక్టర్లు అతడిని విచారించినప్పుడు, రెండు వారాల క్రితం ఒక రోడ్ సైడ్ పానీపూరీ, ఫిల్టర్ చేయని నీటిని తాగినట్టు చెప్పాడు. వెంటనే అతడికి టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో తీవ్రమైన హెపటైటిస్ A ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇందులో లివర్ ఎంజైమ్లు పెరగడంతో పాటు పాజిటివ్ యాంటీ-HAV IgM యాంటీబాడీస్ ఉన్నట్లు వెల్లడించారు.
యువకుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు కీలక విషయాలు వెల్లడించారు. “హెపటైటిస్ A చాలా మంది యువకులలో ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నిర్లక్ష్యంగా ఉంటే తీవ్రమైన అసౌకర్యం, సమస్యలను కలిగిస్తుంది. అపరిశుభ్రమైన స్ట్రీట్ ఫుడ్ తినడం సాధారణమైన విషయం. కానీ, తీవ్రమైన కాలేయ ఇన్ఫెక్షన్లకు ఎలా కారణం అవుతుందో తెలియజేస్తుంది” అని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్ష తేజా వెల్లడించారు.
పానీపురి, చట్నీలు, పచ్చి సలాడ్లు, ఉడికించని నూడుల్స్ లాంటి స్ట్రీట్ ఫుడ్స్ హెపటైటిస్ Aకి కారణం అవుతాయి. అపరిశుభ్రత, కలుషిత నీటి కారణంగానూ ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాలలో తగినంత పారిశుధ్యం లేని ప్రాంతాలలో ఇది సర్వసాధారణం. ఇన్ఫెక్షన్ను నివారించడానికి సరిగా చేతులు కడుక్కోవడం, అపరిశుభ్రమైన స్ట్రీట్ ఫుడ్ తీసుకోకపోవడం, కాచి వడపోయిన నీటిని తాగడం మంచిదని వైద్యులు సూచించారు.
అటు హెపటైటిస్ Aని అరికట్టేందుకు ప్రస్తుతం దేశంలో వ్యాక్సీన్స్ అందుబాటులో ఉన్నాయి. క్రమం తప్పకుండా హెపటైటిస్ Aకు సంబంధించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఈ వ్యాక్సీన్స్ పట్ల స్థానిక ప్రాంతాలలో టీకాలను ప్రోత్సహించాలి. దేశంలో హెపటైటిస్ A, E నివారించదగిన సమస్యలేనని డాక్టర్లు వెల్లడించారు. పారిశుధ్యం, ఆహార భద్రతతో పాటు టీకాలను వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ ముప్పు తగ్గించుకునే అవకాశం ఉందంటున్నారు. మనం ఎక్కడ తింటాము? ఎలాంటి నీరు తాగుతాము? లాంటి అంశాలు కాలేయ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో బయటి ఫుడ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
Read Also: పళ్లు తోమకపోతే పోతారు.. తాజా స్టడీలో తేలింది ఇదే!