Homemade Drinks: నీరు దాహం తీర్చడానికి మాత్రమే కాదు.. శరీరంలోని వివిధ జీవక్రియలు నిర్వహించడానికి కూడా ముఖ్యం. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఆయుర్వేదం ప్రకారం..రోజులో రెండుసార్లు నీరు లేదా ఇంట్లో తయారు చేసుకున్న కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో , రాత్రి పడుకునే ముందు వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ముఖ్యంగా.. రాత్రి పడుకునే ముందు కాస్త నీరు లేదా ఏదైనా ప్రత్యేకంగా తయారు చేసిన డ్రింక్ తాగడం వల్ల అలసట తొలగిపోతుంది. అంతే కాకుండా శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. అలాంటి కొన్ని డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె-నిమ్మకాయ నీరు:
గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం, ఒక చెంచా తేనె కలిపి త్రాగాలి. ఇది.. శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తుంది. అంతే కాకుండా నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు విషయంలో.. తేనెలో ఉండే శోథ నిరోధక లక్షణాలు గొంతుకు ఉపశమనం కలిగిస్తాయి. అంతే కాకుండా శరీరానికి విశ్రాంతి నిచ్చి, మంచిగా నిద్ర పట్టడానికి సహాయపడతాయి. శరీరంలోశక్తి స్థాయిలను నిర్వహిస్తాయి.
గోరు వెచ్చని నీరు:
రాత్రి పడుకునే 30 నిమిషాల ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగాలి. రాత్రిపూట శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. మలబద్ధకం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. కండరాలు, కీళ్ళను సడలిస్తుంది. ముఖ్యంగా వెన్నునొప్పి లేదా కండరాల ఒత్తిడి విషయంలో నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో.. మంచి నిద్ర పొందడంలో సహాయపడుతుంది.
మీరు పడుకునే ముందు కొద్దిగా తేనె కలిపి చమోమిలే టీ, పుదీనా టీ లేదా అల్లం టీ వంటి హెర్బల్ టీలు కూడా తాగవచ్చు. చమోమిలే టీ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మనస్సును ప్రశాంత పరుస్తుంది. మంచి నిద్రకు కూడా ఉపయోగపడుతుంది. పుదీనా టీ జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరానికి విశ్రాంతతస్తుంది. అల్లం టీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది.
Also Read: బ్లాక్ కాఫీ లేదా మిల్క్ కాఫీ ఆరోగ్యానికి ఏది మంచిది ?
సోంపు నీరు:
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు వేసి.. 2-3 గంటలు అలాగే ఉంచి, ఆ తర్వాత త్రాగాలి. ఈ డ్రింక్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఆమ్లత్వం నుండి ఉపశమనం ఇస్తుంది. గ్యాస్, అజీర్ణం , ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
జీలకర్ర నీరు:
ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి.. 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై వడకట్టి తాగాలి. ఈ డ్రింక్ జీవక్రియను పెంచడంలో , బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.