Sunnam Cheruvu: స్వేచ్ఛ బ్యూరో: ఒక వైపు బోరబండ బస్తీ.. మరో వైపు ఐటీ కారిడార్ ఇలా మాస్ ప్లస్ క్లాస్ ల మధ్య మాధాపూర్ గుట్టల బేగంపేటలో మురికి కూపంగా ఉన్న సున్నం చెరువు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ చెరువుకు కబ్జాల నుంచి విముక్తి కల్గి్ంచిన హైడ్రా ఇపుడు సర్వాంగ సుందరగా హైడ్రా తీర్చిదిద్దుతుంది. ఆక్రమణలతో కుంచించుకుపోయి మురుగు నీటి కుంటలా మారిన సున్నం చెరువుకు పూర్వ వైభవం తెచ్చేందుకు హైడ్రా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. దాదాపు 14.20 ఎకరాలకు కుంచించుకుపోగా, ఆక్రమణలను తొలగించి 30.5 ఎకరాలుగా హైడ్రా ఈ చెరువును విస్తరించింది. ఎక్కడా నిర్మాణ నివాసాలను తొలగించలేదు. ఇక్కడి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పాదరసం, సీసం, ఆర్సెనిక్, ఫ్లోరైడ్, పురుగుమందల వంటి విషపూరిత పదార్థాలున్నట్టు పీసీబీ నివేదిక కూడా ఇచ్చింది. తాత్కాలిక షెడ్డులు వేసి మురుగు నీటి దందాకు హైడ్రా చెక్ పెట్టింది. 3 మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి మురుగు వాసన లేకుండా హైడ్రా చర్యలు చేపట్టింది. అక్కడ దుర్గంధభరిత వాతావరణం తొలగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చెరువు ప్రారంభానికి ముందే వేలాది మంది ఉదయం, సాయంత్రం చెరువు చుట్టూ నిర్మించిన బండ్ మీద వాకింగ్ చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో చెరువు అభివృద్ధి పనులు పూర్తికానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే ఈ చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని హైడ్రా వెల్లడించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో గుడిసెలు వేసుకుని ఇబ్బందికరమైన వాతావరణంలో నివాసం ఉన్నవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు హైడ్రా తెలిపింది.
ఆకట్టుకునేలా శ్రీ ఆంజనేయ స్వామి గుడి..
చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో చుట్టూ చెత్త, చెదారం, దుర్గంధ భరిత వాతావరణంలో ఉన్న శ్రీ అంజనేయ గుడిని కూడా హైడ్రా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ ప్రతినిధులతో పలుసార్లు హైడ్రా సమావేశం కూడా నిర్వహించింది. వారి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని గొపురాన్ని నిర్మిస్తుంది. ఆలయానికి వెళ్లే దారితో పాటు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి పాత్ వే కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆలయానికి వచ్చిన వారు కూర్చునేందుకు పాలరాతి గజబోను కూడా నిర్మిస్తోంది. గుడికి ముందు వాటర్ ఫౌంటైన్లో శ్రీ ఆంజనేయుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ పనులు త్వరలోనే పూర్తి చేసి గుడికి మంచి రూపాన్నివ్వనుంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న అభివృద్ధిని ఆలయ కమిటీ ప్రతినిధులు స్వాగతిస్తున్నారు. అక్కడ కొంత మంది గుడిని అడ్డం పెట్టుకుని అభివృద్ధిని అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఆలయాన్ని హైడ్రా తొలగిస్తున్నదనే తప్పుడు ప్రచారాన్ని చేస్తూ లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తున్నట్లు హైడ్రా తెలిపింది. దీంతో ఆలయ కమిటీ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు.
చెరువు చుట్టూ ఆకర్షణలు..
సున్నం చెరువుచుట్టూ విశాలమైన బండ్పై పాత్వే ను హైడ్రా సిద్ధమైంది. ఎక్కడికక్కడ కూర్చునేందుకు రాతి కుర్చీలను, సేద దీరేందుకు గజబోలను అందుబాటులోకి హైడ్రా తీసుకు వస్తోంది. పిల్లల ప్లే ఏరియాలు, పచ్చిక బయళ్లు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తోంది. చెరువు చుట్టూ ఔషధ, సుగంధ మొక్కలు, నీడనిచ్చే చెట్లను నాటి పచ్చదనాన్ని పెంచుతోంది. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ ఉండేలా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది. బతుకమ్మలు ఆడేందుకు బేబీ పాండ్ను కూడా అందుబాటులోకి తేనుంది. చెరువులో బోటింగ్ చేసే విధంగా పర్యాటక ఏర్పాట్లు అందుబాటులోకి రానున్నాయి. చెరువు గట్టు చుట్టూ సోలార్ లైట్లు ఏర్పాటు చేయడమే గాక, పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. చెరువుకు ఆనుకుని ఉన్న సహజసిద్ధమైన కొండను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు హైడ్రా శుక్రవారం వెల్లడించింది.
Also Read: కాంగ్రెస్కు ఊహించని షాక్.. కామారెడ్డిలోనే కవిత ఫైనల్ పంచ్!