మన దేశంలో సినిమా స్టార్లకు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో పెద్దగా చెప్పాల్సి అవసరం లేదు. పాత తరం హీరోల నుంచి కుర్ర హీరోల వరకు, అలనాటి నటీమణుల నుంచి నేటి హాట్ బ్యూటీల వరకు ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిని బట్టి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తమ అభిమాన నటీనటుల సినిమాలో థియేటర్లలోకి వస్తున్నాయంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఫెక్సీలు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, మీడియా ముందు తన స్టార్ల గొప్పదనాన్ని చెప్పడం.. ఒకటేమిటీ థియేటర్ల దగ్గర సందడే సందడి. అయితే, దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ సినిమా థియేటర్లు ఉన్నాయో మీకు తెలుసా? అందులో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకోవాలనుందా? అయితే, ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే.
అత్యధిక సినిమా థియేటర్లు ఉన్న రాష్ట్రాలు
ప్రస్తుతం దేశంలో సుమారు 11,000 థియేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధిక థియేటర్లు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. ఏపీలో మొత్తం 1097 సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇక ఏపీలో కాకినాడ, రాజమండ్రిలో అత్యధిక థియేటర్లు ఉన్నాయి. ఎక్కువ సినిమా హాళ్లు ఉన్న రెండో రాష్ట్రంగా తమిళనాడు ఉంది. ఇక్కడ మొత్తం 943 థియేటర్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో కర్నాటక కొనసాగుతుంది. ఇక్కడ 719 థియేటర్లు ఉన్నాయి. ఇక మహారాష్ట్ర 703 థియేటర్లతో 4వ స్థానంలో ఉండగా, 485 థియేటర్లతో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. 420 సినిమా థియేటర్లతో గుజరాత్ 6వ స్థానంలో ఉంది. ఇక ఏడో స్థానంలో వెస్ట్ బెంగాల్ నిలిచింది. ఈ రాష్ట్రంలో 373 థియేటర్లు ఉన్నాయి. ఇక దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా కొనసాగుతున్న ఉత్తర ప్రదేశ లో కేవలం 321 థియేటర్లు ఉన్నాయి.
అతి తక్కువ సినిమా థియేటర్లు ఉన్న రాష్ట్రాలు
అటు అత్యల్పంగా సిక్కిం, నాగాలాండ్ లో 2 చొప్పున థియేటర్లు ఉన్నాయి. త్రిపురలో 4, మేఘాలయలో 6, జమ్మూకాశ్మీర్ లో అత్యల్పంగా 11 థియేటర్లు ఉన్నాయి. చండీగఢ్ లో 12, హిమాచల్ ప్రదేశ్ లో 15, జార్ఖండ్ లో 59, అస్సాంలో 61, హర్యానాలో 72, చత్తీస్ గఢ్ లో 92, ఒరిస్సాలో 141 థియేటర్లు ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Read Also: ఆ దేశాల్లో పాలను నిల్వ ఉంచేందుకు వాటిలో కప్పలను వేస్తారట, భలే చిట్కా!
కరోనా తర్వాత అగమ్యగోచరంగా థియేటర్ల పరిస్థితి
కరోనాకు ముందు సినిమా థియేటర్లకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలి వచ్చేవారు. కానీ, కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజు రోజుకు థియేటర్లకు ప్రేక్షకులు రావడమే మానేశారు. స్టార్ హీరోల సినిమాలు అయితే, అటు ఇటు వారం రోజుల పాటు థియేటర్ల దగ్గర సందడి కనిపిస్తుంది. ఆ తర్వాత కామ్ అవుతోంది. ఓటీటీల దూకుడు ముందు చాలా మంది యజమానులు థియేటర్లను నడిపే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: చెట్టు మీద కూర్చోడానికి ఆడ సింహం పాట్లు, చివరికి.. సదా వైల్డ్ వీడియో వైరల్!