Dulquer salman: మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు దుల్కర్ సల్మాన్. మాతృభాషలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన.. టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో దివంగత నటీమణి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘మహానటి’ చిత్రం ద్వారా జెమినీ గణేషన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. మొదటి సినిమాతోనే తన నటన ప్రతిభను కనబరిచి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక అలా చిన్నచిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన దుల్కర్.. తొలిసారి హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ సీతారామం’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దుల్కర్ సల్మాన్.
ఒకవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే.. మరొకవైపు మళయాలంలో చిత్రాలను నిర్మిస్తూ బిజీగా మారిన ఈయన గత కొంత కాలం క్రితం వాహనాల స్మగ్లింగ్, పన్ను ఎగవేత కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నకిలీ పత్రాలను ఉపయోగించి భూటాన్ నుండి.. పాత ఎస్ యు వి లగ్జరీ కార్లను ఇండియాలోకి అక్రమంగా తీసుకొస్తున్న ఒక ముఠాతో దుల్కర్ కి సంబంధం ఉంది అనే కోణంలో పోలీసులు పలుమార్లు ప్రశ్నించారు. అయితే ఇప్పుడు మరొకసారి ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. కోయంబత్తూరు కేంద్రంగా.. పన్ను ఎగ్గొట్టడానికి భూటాన్ నుండి వాహనాలను కొనుగోలు చేసి.. పత్రాలను మార్చేసి అధిక ధరకు విక్రయిస్తున్న ఒక స్మగ్లింగ్ ముఠాను లక్ష్యంగా చేసుకున్న కస్టమ్ అధికారులు “ఆపరేషన్ నమ్ ఖోర్ ” పేరిట దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ముఠా భూటాన్ సరిహద్దు గుండా కారులను అక్రమంగా రవాణా చేసి నకిలీ పత్రాలను సృష్టించి, వాటిని ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్ చేయించి అధిక ధరలకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక అదే సమయంలో ఈ ముఠాతో దుల్కర్ సల్మాన్ కి సంబంధం ఉన్నట్లు అనుమానం వచ్చి.. ఈయన కారులను కూడా తనిఖీలు చేయగా.. అందులో ఈయనకు సంబంధించిన ల్యాండ్ రోవర్ డిఫెండర్, నిస్సాన్ పెట్రోల్ తో పాటు ఏకంగా నాలుగు విలాసవంతమైన కార్లను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
also read:ఘనంగా జాన్వీకపూర్ సోదరి పెళ్లి.. ముహూర్తం ఫిక్స్.. కాక్ టెయిల్ పార్టీ ఎప్పుడంటే?
ముఖ్యంగా భారీ మొత్తంలో కస్టమ్ డ్యూటీ ఎగవేస్తున్నట్లు తేలగా.. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన కస్టమ్ అధికారులు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారుగా 60 వాహనాలను సీజ్ చేయగా.. ఈ స్మగ్లింగ్ తో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్టు చేసి విచారణను మరింత వేగవంతం చేశారు. అందులో భాగంగానే ముఠాకు సంబంధించిన కేసులో ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ ను కస్టమ్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. కొచ్చి లోని కస్టమ్స్ కార్యాలయంలో సుమారుగా 4 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా కస్టమ్ అధికారులు మొత్తం 4 లగ్జరీ వాహనాలను సీజ్ చేయగా.. గతంలోనే వాటిలో రెండింటిని ఆయన ముందే తాత్కాలికంగా విడిపించుకున్నారు . మిగిలిన రెండు వాహనాలను విడిపించుకునేందుకు ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం . ఈ నేపథ్యంలోనే దుల్కర్ వద్ద ఉన్న ఇతర ఖరీదైన వాహనాల వివరాలను కూడా అధికారులు సేకరించి, అవసరమైతే వాటిని కూడా తనిఖీల కోసం తమ ముందుకు తీసుకురావాల్సిందిగా దుల్కర్ కి సూచించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విచారణలో దుల్కర్ తో పాటు ఈ కేసుకి సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నలుగురిని కూడా అధికారులు ప్రశ్నించారు.