Bellamkonda Sai Srinivas: టాలీవుడ్ కుర్ర హీరోల్లో ఇంకా స్ట్రగుల్ అవుతున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ స్టార్ వారసులు కూడా అంత గ్రాండ్ ఎంట్రీ ఇవ్వలేదు అంటే అతిశయోక్తి కాదు. స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోయిన్.. ఇంకో స్టార్ హీరోయిన్ ఐటెంసాంగ్.. భారీ భారీ సెట్లు.. అబ్బా బెల్లంబాబు మొదటి సినిమా చూస్తే షాక్ అవ్వాల్సిందే. అంతేనా ఆ తర్వాత ఈ హీరో నుంచి వచ్చిన కొన్ని సినిమాలు కూడా అంతే గ్రాండ్ గా ఉన్నాయి.
సినిమాలు అయితే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ కొద్దిగా తగ్గాడు. గ్రాండ్ కాకుండా కథలను మంచిగా ఎంచుకుంటే విజయాలు దక్కుతాయని రియలైజ్ అయ్యాడు. వరుసగా సినిమాలు చేయకుండా ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఏడాదికి ఒక్క సినిమా ప్రకటిస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం సినిమా మొదలెట్టేటప్పుడు ప్రకటించకుండా షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ డేట్ చెప్పడానికి అనౌన్స్ చేశాడు. అదే కిష్కింధపురి.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగలపాటి దర్శకత్వం వహించిన చిత్రం కిష్కింధపురి. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12 న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యింది.. ఎప్పుడు షూటింగ్ ను ఫినిష్ చేసుకుంది అనే విషయం ఎవరికీ తెలియదు. సరే ఈ సినిమాను పక్కన పెడితే దీనికన్నా ముందు బెల్లంబాబు రెండు సినిమాలను ప్రకటించాడు. అవేమి అల్లాటప్పా సినిమాలు కూడా కాదు. స్టార్ ప్రొడక్షన్ హౌస్ లో అనౌన్స్ చేసిన సినిమాలు. అవే స్టూవర్టుపురం దొంగ, టైసన్ నాయుడు.
స్టూవర్టుపురం దొంగ.. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. KS దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా అసలు ఎటుపోయిందో పత్తా లేదు. ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన తరువాత రవితేజ.. టైగర్ నాగేశ్వరరావు పేరుతోనే ఒక సినిమాను అనౌన్స్ చేయడం, రిలీజ్ చేయడం, అది ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమా ఫలితాన్ని చూసి.. స్టూవర్టుపురం దొంగ ఎందుకులే అనుకున్నారా.. ఏమో తెలియరాలేదు.
ఇక స్టూవర్టుపురం దొంగ కాకుండా బెల్లంబాబు అనౌన్స్ చేసిన మరో సినిమా టైసన్ నాయుడు. భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా మొదలయ్యింది. ఇక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. ఇది షూటింగ్ కూడా జరుపుకుందని సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ లేదు. తాజాగా. ఈ సినిమా రిలీజ్ పై కుర్ర హీరో స్పందించాడు. టైసన్ నాయుడు షూటింగ్ పూర్తయ్యింది కానీ, కొన్ని కారణాల వలన రిలీజ్ వాయిదా పడిందని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ కానున్నాయి.. అసలు రిలీజ్ అవుతాయా అనేది తెలియాల్సి ఉంది.