Parliament Canteen: పార్లెమెంటు సమావేశాల్లో నిత్యం సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటారు. ఏదైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకేతాటి మీదకు వచ్చేస్తారు. మంగళవారం పార్లమెంటు క్యాంటీన్లో భారీగా సువాసనలు గుబాళించాయి. స్పెషల్ విందుకు 120 మంది ఎంపీలు హాజరయ్యారు. ఇంతకీ అసలు విషయం మీకు తెలుసా?
పార్లమెంటులో మంగళవారం రాజకీయ చర్చలు-గందరగోళం నడుమ ఒక విలక్షణమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సభ తర్వాత మధ్యాహ్నం చాలామంది ఎంపీలు క్యాంటీన్కు వెళ్లారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ తరుణ్ చుగ్.. పార్లమెంటు క్యాంటీన్లో ఎంపీల కోసం ప్రత్యేక అమృత్సరి విందు ఏర్పాటు చేశారు. దీన్ని అమృత్సర్ నుండి తెప్పించారు. ఎందుకంటే.. ఆయన సొంతూరు పంజాబ్ కావడంతో అక్కడ ఫేమస్ వంటకాలు రైలులో ప్రత్యేకంగా తెప్పించారు.
క్యాంటీన్ టేబుల్ అంతా ప్రసిద్ధ అమృత్సరి కుల్చా, పంజాబీ లస్సీ, ఫ్రూట్ క్రీమ్తోపాటు కొన్ని విలక్షణమైన రుచులతో నిండిపోయింది. కొద్ది నిమిషాల వరకు సభలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న ఎంపీలు.. అమృత్సర్ ప్రత్యేక విందు చూసి షాకయ్యారు. తరుణ్ చుగ్ స్వయంగా తన తోటి సభ్యులకు వడ్డించారు. కేవలం 200కు పైగా వడ్డనలు జరిగాయి. స్పెషల్ విందు గురించి తెలుసుకున్న మిగతా ఎంపీలు క్యాంటీన్కు వచ్చారు.
సభ్యుల డిమాండ్ను తీర్చడానికి అదనపు డిస్పోజబుల్ ప్లేట్లను ఏర్పాటు చేశారట. ఈ విందుకు ఒక పార్టీకి చెందిన ఎంపీలు కాకుండా, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 120 మందికి పైగా ఎంపీలు హాజరయ్యారు. సభలో అధికార-విపక్షాల మధ్య వాదోపవాదాలు ఉన్నప్పటికీ, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు భోజన వద్ద కలిసి కనిపించారు. అమృత్సరి వంటకం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చోలే-కుల్చా, లస్సీ, పంజాబీ వంటకాలకు మాంచి గుర్తింపు ఉంది.
ALSO READ: రెస్టారెంట్లపై ఉక్కుపాదం.. నగరవాసుల నీరాజనం.. ఈ ఐఏఎస్ రూటే సెపరేటు!