Kejriwal Yamuna water poison| ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు నేను మూడు బాటిళ్ల యమునా నది నీటిని పంపిస్తా. ఆ నీటిని మీరు ప్రెస్ మీట్లో తాగాలి. అలా చేస్తే, మేము మా తప్పును ఒప్పుకుంటాము” అని అన్నారు.
కేజ్రీవాల్ హర్యానా ప్రభుత్వం యమునా నది నీటిలో వ్యర్థాలు వదులుతోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేజ్రీవాల్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల లోపు వివరణ ఇవ్వాలని సూచించింది. దీనిపై కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మూడు బాటిళ్ల యమునా నది నీటిని మీడియా ప్రతినిధుల ముందు పెట్టారు.
మీడియా సమావేశంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానిస్తూ.. “అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు వెదజల్లుతున్నాయి. కానీ ఈసీ వాటిని గుర్తించడం లేదు” అని చెప్పారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ రిటైర్ అవుతున్న నేపథ్యంలో రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తుండవచ్చు అని కూడా కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు.
7 పీపీఎం అమ్మోనియా స్థాయితో ఉన్న యమునా నీటిని ఎన్నికల కమిషనర్లకు పంపిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. “అయితే, ఈ నీటిని ముగ్గురు కమిషనర్లు తాగితే మేము మా తప్పును ఒప్పుకుంటాం” అని ఆయన అన్నారు. అమోనియా స్థాయి పెరిగి, యమునా నీరు విషపూరితమైందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడాన్ని ఆయన కుట్రగా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన కేంద్ర హోమంత్రికి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు, “ఈ నీటిని ప్రజల సమక్షంలో తాగమని చెప్పండి” అని.
యమున నది నీరు కలుషితం వివాదంలో హర్యాణా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య రాజకీయం జరుగుతోంది. అయితే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం లాగా మార్చకూడదని కేజ్రీవాల్ను హెచ్చరించింది. నదీ జలం కలుషితం అంశాన్ని రాజకీయంగా తీసుకోకుండా సాక్ష్యాలను సమర్పించాలని ఈసీ సూచిస్తూ ఒక లేఖ రాసింది. మరోవైపు, కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హర్యాణా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 17వ తేదీ కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.
Also Read: ఢిల్లీ ప్రజలకు అడ్డగోలు ఉచితాలు.. కానీ ఈ డేంజర్ ఇష్యూ పట్టించుకోరేంటి..?
ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు ఓటమి భయం : అమిత్ షా
వచ్చే నెల 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యమునా నదిలో బిజేపీ విషం కలిపిందని చేస్తున్న ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ ఆరోపణలపై ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ, “ఢిల్లీ ప్రజలతో మురికి నీటిని తాగిస్తున్న ఆప్ పాలనను విమర్శిస్తూ, కేజ్రీవాల్ ఎన్నికల్లో విజయం కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని” పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేజ్రీవాల్ ఇలా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీన బిజేపీకి ఓటు వేసి ఒక్క అవకాశం ఇవ్వాలని పేర్కొంటూ, “బిజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీని నంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దుతామని” హామీ ఇచ్చారు.
అలాగే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ కంటోన్మెంట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. “బిజేపీ మాత్రమే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే పార్టీ” అని పేర్కొంటూ, ఈసారి ఢిల్లీలో బిజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. అభ్యర్థులను కాకుండా బిజేపీ గుర్తుని మాత్రమే చూడాలని చెప్పారు.