Richest MLA In India : దేశంలోని అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) బహిర్గతం చేసింది. దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేకు రూ. 3,400 కోట్ల ఆస్తులు ఉన్నాయని, అత్యంత పేద ఎమ్మెల్యే దగ్గర కేవలం రూ. 1,700 మాత్రమే ఉన్నాయని ADR తెలిపింది. ఇద్దరూ బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ ఆర్థిక వివరాలను ADR సేకరించింది.
ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేత పరాగ్ షా, రూ. 3,400 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. అయితే, పశ్చిమ బెంగాల్ లోని సింధు నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధార, కేవలం రూ. 1,700 ఆస్తులతో అత్యంత పేద ఎమ్మెల్యేగా నమోదయ్యారు.
Also Read: నిరుపేద కూలీకి రూ.23 లక్షల జీఎస్టీ నోటీసు!.. లక్షల కోట్లలో పన్ను ఎగవేతలు
టాప్ 10 ధనిక ఎమ్మెల్యేల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. టాప్ 20 జాబితాలో ఏపీ నుంచి ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తులు రూ. 931 కోట్లు కాగా, మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు రూ. 757 కోట్లు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే మరియు మంత్రి పి. నారాయణ ఆస్తులు రూ. 824 కోట్లు, మరో టీడీపీ ఎమ్మెల్యే వి. ప్రశాంతి రెడ్డి ఆస్తులు రూ. 716 కోట్లు ఉన్నాయి. వీరు టాప్ 10 లో ఉండగా, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టాప్ 20 జాబితాలో ఉన్నారు.
రాష్ట్రాల వారీగా, కర్ణాటక ఎమ్మెల్యేలు (223 మంది) సగటు సంపద రూ. 14,179 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు (286 మంది) రూ. 12,424 కోట్ల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు (174 మంది) మొత్తం సంపద రూ. 11,323 కోట్లు ఉంది. అత్యల్ప ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేల రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. త్రిపురాలోని 60 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు రూ. 90 కోట్లు మాత్రమే ఉన్నాయి. మణిపూర్ ఎమ్మెల్యేలు (59 మంది) రూ. 222 కోట్లు, పుదుచ్చేరి ఎమ్మెల్యేలు (30 మంది) రూ. 297 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు.
28 రాష్ట్ర అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 4,092 మంది ఎమ్మెల్యేల సంపద కూడితే రూ. 73,348 కోట్లుగా తేలింది. ఈ మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాగాలాండ్ (రూ. 23,086 కోట్లు), త్రిపుర (రూ. 26,892 కోట్లు), మరియు మేఘాలయ (రూ. 22,022 కోట్లు) వార్షిక బడ్జెట్లను మించిపోయింది.