Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో నిర్వహించిన ఒక బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ విమర్శలు గుప్పించారు.
వందేమాతరం వివాదం.. అమిత్ షా డిమాండ్
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారని అమిత్ షా తీవ్రంగా ఆరోపించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ జాతీయ గేయాన్ని అవమానించిందని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనను దేశ ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారని, ఇటువంటి చర్యలు అత్యంత సిగ్గుచేటని పేర్కొన్నారు. జాతీయ గేయాన్ని అవమానించినందుకు గాను సోనియా గాంధీ వెంటనే దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేసిన ఈ పొరపాటును దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని వ్యాఖ్యానించారు.
ర్యాలీకి ముందు ఉద్రిక్తత.. ముందస్తు అరెస్టులు
అమిత్ షా చిత్తోర్గఢ్ పర్యటనకు ముందే అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్రమంత్రి పర్యటనను అడ్డుకోవడానికి, నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించిన 24 మంది కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు విద్యార్థులను రాజస్థాన్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ స్టేషన్ ముట్టడి
ఇటీవల జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారాలు, దిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడుల ఘటనలపై కేంద్ర హోంమంత్రి స్పందించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ వందలాది మంది విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
Also Read: భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!