Fake Idol: స్వేచ్చ బ్యూరో: అద్భుత మహిమలు ఉన్న పంచంలోహ లక్ష్మీదేవి విగ్రహం.. అరుదైన రాయి.. మీ ఇంట్లో పెట్టుకోండి. అమ్మవారి కటాక్షంతో సిరిసంపదలు పొందండి అని చెబుతూ మోసాలు చేస్తున్న 6గురిని జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు మైలార్ దేవ్ పల్లి పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. ఉమ్మడిగా దాడి చేసి పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేటకు చెందిన కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప, మైలార్ దేవ్ పల్లి ప్రాంతానికి చెందిన నరసింహ, వడత్య కుమార్, ప్రవీణ్ సింగ్, మంగళి బసవ నరేష్, వేములవాడకు చెందిన సిద్ధాంతి చల్లా రవి తేలికగా డబ్బు సంపాదించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. 2024లో నరసింహ, చల్లా రవిలు వేములవాడకు చెందిన కొండపల్లి భిక్షపతి వద్ద నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని రూ. 10లక్షలకు కొని మోసపోయారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని వడత్య కుమార్కు అందజేశాడు. ఆ తర్వాత గ్యాంగుగా ఏర్పడి ఆ నకిలీ విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మబలికి అమాయకులకు భారీ ధరలకు విక్రయించాలని ప్లాన్ చేశారు.
Also Read: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో విషాదం.. ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపడి తీవ్ర గాయాలు!
అదే సమయంలో కేతావత్ రాజు తన వద్ద ఒక అరుదైన గులాబీ రంగు రాయి ఉందని, దాన్ని కూడా అధిక ధరకు విక్రయించవచ్చని భావించి ముఠాలో చేరాడు. శనివారం కాటేదాన్, లక్ష్మిగూడ సమీపంలో ఈ నకిలీ విగ్రహం, రాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నకిలీ పంచంలోహ విగ్రహం, గులాబీ రంగు రాయి, ఎర్టిగా కారు, 5 మొబైల్ ఫోన్లు, 3 రసాయన ద్రావణాల బాటిళ్లు, 2 ఎరుపు రంగు తువ్వాళ్లు సీజ్ చేశారు. టాస్క్ఫోర్స్ సీఐ ఛెత్రి యాదేందర్, ఎస్ఐ సందీప్ రెడ్డి బృందం మైలార్దేవ్పల్లి పోలీసులతో కలిసి ఈ అపరేషన్ నిర్వహించారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ లో అప్పగించారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం