Second Marriage: మొదటి భార్యకు చట్టబద్దంగా విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అస్సాం ప్రభుత్వం సిద్ధమైంది. ఇలాంటి కేసుల్లో సంబంధిత ఉద్యోగి జీతం నుంచి 20 శాతం మొత్తాన్ని కోత విధించి.. దానిని నేరుగా మొదటి భార్య బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం వెల్లడించారు. బాధితురాలైన మొదటి భార్య.. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ఈ చర్యలు చేపడతామని ఆయన భరోసా కల్పించారు.
ప్రభుత్వ ఉద్యోగులు మెుదటి భార్యను వదిలేసి.. రెండో పెళ్లి చేసుకుంటున్న ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అయితే న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్లో ఉన్నంత కాలం లేదా వివాదం తేలే వరకు మొదటి భార్య ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కోర్టు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆమెకు ఈ ఆర్థిక సాయం నిరంతరాయంగా అందుతుందని వివరించారు.
భార్యలను మోసం చేసే ఉద్యోగుల జీతంలో కోతతో పాటు.. ప్రభుత్వ సర్వీసు నిబంధనల కింద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. కాగా, అస్సాంలో ఇప్పటికే బహుభార్యత్వాన్ని (Polygamy) నిషేధిస్తూ చట్టపరమైన, పరిపాలనాపరమైన నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్లోనూ రెండో పెళ్లిపై ఇప్పటికే ఆంక్షలు ఉండటం గమనార్హం.
Also Read: ‘దమ్ముంటే అసెంబ్లీకి రండి’.. వైసీపీ నేతలకు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!
కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ తరహా నిబంధనలను వర్తింపజేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. దీనికోసం తగిన శాసనపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విడాకులు లేకుండా భర్త వదిలేసిన మహిళలకు ఆర్థికంగా భద్రత కల్పించడమే తమ చర్యల ప్రధాన లక్ష్యమని సీఎం మరోమారు పునరుద్ఘటించారు.
Also Read: పాకిస్తాన్లో ఘోరం.. ప్రముఖ టిక్టాక్ స్టార్ దారుణ హత్య.. చెల్లెలికి తీవ్ర గాయాలు!