Telegram Piracy: టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న సినిమా, ఓటీటీ (OTT) కంటెంట్ పైరసీపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.. టెలిగ్రామ్ యాప్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఈ విస్తృత పైరసీని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చింది.
భారత సినీ పరిశ్రమ, ఓటీటీలు, బ్రాడ్కాస్టర్లు, నిర్మాతలు, పంపిణీదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నోటీసులు జారిచేసింది. దేశీయ క్రియేటర్ ఎకానమీని దెబ్బతీస్తున్న పైరసీ రక్కసిని అణచివేయడానికి టెలిగ్రామ్ తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ప్లాట్ఫారమ్ ద్వారా పైరేటెడ్ సినిమాలు, ఆడియో-విజువల్ కంటెంట్ విస్తృతంగా వ్యాప్తి చెందడాన్ని వెంటనే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఇంతకాలం ప్రభుత్వం, చలనచిత్ర సంస్థలు ఫిర్యాదు చేసినప్పుడు సదరు పైరసీ ఛానెళ్లను మాత్రమే తొలగిస్తూ వచ్చారు. ఇకపై ఆ పద్ధతికి చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతి ఛానెల్ను గుర్తించి చెప్పే వరకు టెలిగ్రామ్ వంటి యాప్స్ వేచి చూడకుండా, పైరసీని అడ్డుకోవడంలో ఆ ప్లాట్ఫారమ్లకే పూర్తి బాధ్యత అప్పగించేలా వ్యూహాన్ని మార్చినట్లు అర్థమవుతోంది. కేవలం స్పందించే పద్ధతిలో కాకుండా, ముందస్తు జాగ్రత్తలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయించే దిశగా అడుగు వేస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ వివాదం మాత్రమే కాదని, అది ముమ్మాటికీ క్రిమినల్ నేరమని నోటీసుల్లో ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. కాపీరైట్ చట్టం-1957, సినిమాటోగ్రాఫ్ చట్టం-1952 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరమని టెలిగ్రామ్కు గుర్తు చేసింది. ఐటీ చట్టం-2000, ఐటీ నిబంధనలు-2021 ప్రకారం మధ్యవర్తి ప్లాట్ఫారమ్లు పాటించాల్సిన కనీస జాగ్రత్తలను (Due Diligence) టెలిగ్రామ్ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
Also Read: మరో ఘోరం.. పాయసంతో భర్తను లేపేసిన భార్య.. బాత్రూమ్ కింద కప్పెట్టి హైడ్రామా!
కాగా, ఇటీవల కాలంలో కేంద్రం సోషల్ మీడియా కమ్యూనికేషన్ ప్లాట్ఫారమ్లపై నిఘా, నియంత్రణను కఠినతరం చేసింది. దీనిలో భాగంగానే మెటా (Meta) సంస్థకు కూడా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చింది. వాట్సాప్లో తీసుకురావాలనుకుంటున్న ‘యూజర్నేమ్’ ఫీచర్పై వివరణ కోరడంతో పాటు, ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో అశ్లీల కంటెంట్ ప్రమోట్ అవుతోందన్న ఆరోపణలపై మెటా ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు టెలిగ్రామ్కు కూడా నోటీసులు ఇవ్వడం గమనార్హం.
Also Read: ఉక్కు పరిశ్రమ జగన్ పుణ్యమే.. చంద్రబాబుది ‘క్రెడిట్ డ్రామా’.. ఎంపీ అవినాష్ ఫైర్