CM Yogi Disputed Mosque | దేశంలో ఇటీవల మసీదు కింద దేవాలయం కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోమారు వివాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదిత స్థలాలకు మసీదు హోదా ఉండదని చెప్పారు. ప్రయాగ్ రాజ్లో మరో రెండు రోజుల్లో కుంభమేళా వేడుకలు ప్రారంభం కానున్నండగా.. ఆయన ప్రయాగ్ రాజ్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
శుక్రవారం సాయంత్రం ఆయన ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “ఇస్లాం మతంలో వివాదిత స్థలాల్లో భగవంతుడి ఆరాధన చేయకూడదని ఉంది. అందువల్ల ఏదైనా వివాదంలో ఉన్న స్థలానికి మసీదు హోదా ఉండదు. వివాదిత స్థలాల్లో మసీదు ఉండడం ఇస్లామిక్ నియమాలకు విరుద్ధం. అటువంటి స్థలాల్లో ఇతర మతాలకు చెందిన వారి మనోభావాలను గాయపరిచేవిధంగా మసీదు నిర్మాణాలు చేయడం ఇస్లాంలో అంగీకారం కాదు. ఇస్లాం ప్రకారం మసీదు ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. కానీ సతాతన ధర్మం అలా కాదు. ప్రత్యేక స్థలంలోనే దేవాలయాలు నిర్మించాలి.” అని చెప్పారు.
Also Read: బిజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మొసళ్లు.. సోదా చేయడానికి వెళ్లిన ఐటీ అధికారులకు..
దేశంలోని పలు సివిల్ కోర్టుల్లో మసీదు కింద పురాతన దేవాలయం ఉందని పిటీషన్లు దాఖలు.. వాటిని కోర్టులు విచారణకు స్వీకరించడంతో దేశవ్యాప్తంగా మసీదు, దేవాలయాల నిర్మాణాల గురించి చర్చ జరుగుతోంది. 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఆగస్టు 15, 1947 రోజున దేశంలోని ప్రార్థనా స్థలాలు ఏ రూపంలో ఉన్నాయో అదే విధానంలో కొనసాగాలి.. వాటి స్వరూపంలో మార్పులు చేయడం కుదరదు. ఈ చట్టం నుంచి ఒక్క అయోధ్య రామ మందిరానికి మాత్రమే మినహాయింపు ఉంది. అయితే ఈ చట్టాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లాలో సంభల్ షాహీ జామా మసీదు నిర్మాణం మొఘల్ సామ్రాజ్య కాలంలో ఒక పురాతన శివాలయాన్ని కూల్చేసి చేశారని వివాదం మొదలైంది. ఆ తరువాత కూడా పలుచోట్ల ఇలాంటి కేసులు కోర్టులకు చేరుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితమే సుప్రీం కోర్టు ఇలాంటి కేసులు విచారణకు స్వీకరించవద్దని కింది కోర్టులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టులో ఇప్పటికే పలువురు సామాజిక కార్యకర్తలు 1991 ప్రార్థనా స్థలాల చట్టం అమలు కోసం పిటీషన్లు వేశారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదిత స్థలాలను మసీదు హోదా ఉండదని వ్యాఖ్యానించడం మరో చర్చకు దారితీయనుంది.
మరోవైపు సిఎం యోగి మహాకుంభమేళా కేంద్రమైన ప్రయాగ్ రాజ్ అంశంపై కూడా స్పందించారు. కుంభమేళా వేడుకలు ప్రయాగ్ రాజ్ లో వేల సంవత్సరాలుగా జరుగుతున్నాయని, అందుకోసం ఈ భూములు వక్ఫ్ బోర్టుకి చెందినవిగా వాదిస్తే తాను అంగీకరించనని అన్నారు. సంభల్ జిల్లాలోని వివాదిత జామా మసీదుపై వక్ఫ్ యజమాన్య హక్కులను కూడా ఆయన ప్రశ్నించారు. సంభల్ ప్రాంతం తరతరాలుగా సనాతన ధర్మ సంప్రదాయాలకు ప్రతీక అని 1526లో అక్కడ ఒక విష్ణు మందిరం ఉండేదని దాన్ని కూల్చేసి అదే ప్రదేశంలో జామా మసీదు నిర్మించారని అన్నారు.