Congress Delhi New Headquarters | గత 47 ఏళ్లుగా దేశ రాజధాని ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చరిత్ర నేటితో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ తన కొత్త జాతీయ కార్యాలయాన్ని కోట్లా రోడ్ లోని 9-ఏ ప్లాట్ వద్ద నిర్మించిన ఇందిరాగాంధీ భవన్ లో ప్రారంభించింది. ఈ కొత్త కార్యాలయం ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యక్రమానికి సుమారు 400 మంది హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సంలో జాతీయ జెండా ఆవిష్కరించి, వందీ మాతరం గీతాన్ని ఆలపించారు.
కొత్త కార్యాలయం ప్రత్యేకతలు
ఈ కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్ అనే పేరు పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇందిరాగాంధీ స్థానం ఎంతో విశిష్టమైందని నాయకులు గుర్తుచేసుకున్నారు. 5 అంతస్తులుగా నిర్మించిన ఈ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ పరిపాలనా, వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైంది.
అంతస్తుల కేటాయింపు
ఐదో అంతస్తులో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ప్రత్యేక కార్యాలయాలు.
నాలుగో అంతస్తు: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శుల కోసం.
మూడో అంతస్తు: రాష్ట్ర ఇంచార్జుల కోసం.
రెండో అంతస్తు: ఏఐసీసీ కార్యదర్శులకు కేటాయించారు.
పైగా కొత్త కార్యాలయంలో మీడియా ప్రతినిధులకు గ్రౌండ్ ఫ్లోర్ వరకే అనుమతి ఉంది. బిజేపీ ప్రధాన కార్యాలయంలో కూడా ఇలాంటి విధానమే ఉండడం గమనార్హం.
Also Read: మహా కుంభమేళాతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం.. రూ.7500 కోట్ల బడ్జెట్
కొత్త కార్యాలయం నిర్మాణం వెనుక కారణాలు
2005-2006లో, సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశం జారీ చేసింది. రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లో కలిగి ఉండకూడదని నిర్దేశించింది. ఆ తరువాత, కాంగ్రెస్ పార్టీ 2009లో కొత్త కార్యాలయం నిర్మాణం చేయాలని భావించింది. అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ చేతుల మీదుగా కొత్త కార్యాలయం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరిగింది. అయితే భవనం నిర్మాణం పూర్తి కావడానికి 15 ఏళ్లు పట్టడం విశేషం.
పొరుగు పార్టీ కార్యాలయాలు
కాంగ్రెస్ కొత్త కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లో నిర్మితమైంది. ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయానికి కేవలం కొద్ది దూరంలోనే ఉంది.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల చరిత్ర
24 అక్బర్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ పాత కార్యాలయం 1978 నుంచి జనవరి 15, 2025 వరకు వరకు కొనసాగింది. 1977లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, అప్పటి రాజ్యసభ ఎంపీ గడ్డం వెంకటస్వామి (కాక), తన అధికారిక నివాసాన్ని కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక కార్యాలయంగా అందించారు. ఈ కార్యాలయంలో ఉన్నప్పుడే.. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విజయాలు అందాయి. కానీ గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడు సార్లు లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది..
విజయాలు: 1980, 1984, 1991, 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.
పరాజయాలు: 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస పరాజయాలు.
ఇందిరాగాంధీ భవన్: కొత్త అధ్యాయం
ఈ కొత్త కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి ప్రేరణగా నిలుస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నూతన కార్యాలయం ప్రారంభంతో, పార్టీ కార్యకలాపాలను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరా భవన్ ప్రారంభంతో, కాంగ్రెస్ పార్టీ తన చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. 24 అక్బర్ రోడ్ లోని విజయాల గౌరవాన్ని గుర్తుంచుకుంటూనే, ఈ కొత్త భవనం కొత్త విజయాలకు వేదిక కావాలని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.