Delhi Bomb Blast : దేశ రాజధానిలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రాజధానిలోని ప్రశాంత్ విహార్ అనే ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింగి, నెల క్రితం ఇదే ప్రాంతంలో బాంబు పేలుడు జరగగా, ఇప్పుడు అదే ప్రాంతంలో మరోసారి పేలుడు జరగడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
గురువారం ఉదయం 11.48 గంటల సమయంలో రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ లో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. ఇది పీవీఆర్ సినిమా దగ్గర్లో జరిగింది. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఈ విషయాన్ని దిల్లీ అగ్నిమాపక శాఖ సైతం ధృవీకరించింది. పేలుడు జరిగిన ప్రాంతానికి తమ బృందాలను పంపినట్లు వెల్లడించింది.
ఈ పేలుళ్లల్లో ఓ వ్యక్తికి గాయాలు కాగా.. మిగతా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అయితే.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో, అదే ప్రాంతంలో తాజా పేలుళ్లు జరిగాయి. దాంతో.. నిఘా వర్గాలు, పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి. సమీపంలోని ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.
ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందాలతో పాటుగా దిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్, బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ బృందాలు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయ. గత కొన్నాళ్లుగా పోలీసులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వాటికి.. తాజా పేలుళ్లకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
నెల క్రితం ఇదే ప్రాంతంలో పేలుడు
రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడ దగ్గర గత నెలలో బాంబు పేలుడు సంభవించింది. ఆ ధాటికి పాఠశాల గోడకు ధ్వంసం కాగా.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో అప్పుడు నగరంలో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. పేలుడుకు కారణాలు, ఎవరు చేశారనే విషయాలు తెలుసుకునేందుకు.. అప్పట్లో దేశంలోని నిఘా, దర్యాప్తు బృందాలు చేరుకుని సమాచారాన్ని సేకరించాయి. అప్పటి నుంచి నగరంలో పేలుడుకు సంబంధించిన ఉద్రిక్త వాతావరణం ఉండగా.. తాజాగా మరోసారి పేలుళ్లు చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు భయపడిపోతున్నారు.
నెల రోజుల క్రితం ఘటన దర్యాప్తులో ప్రత్యేకంగా ఎవరూ బాంబును ఉంచలేదనే విషయాన్ని కనుక్కున్నారు. సమీపంలోని పారిశ్రామిక వాడ నుంచి వచ్చిన చెత్తను పడేయగా.. అటుగా నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి పడేసిన సిగరేట్ కారణంగా పేలుడు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. రసాయనిక వ్యర్థలపై కాలిన సిగరేట్ పడడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగినట్లు.. సీసీ కెమెరా దృశ్యాల్లోనూ స్పష్టంగా కనిపించింది.
Also Read : అజ్మేర్ దర్గాలో శివాలయం?.. దర్గా కమిటీ, ప్రభుత్వానికి కోర్టు నోటీసులు
కాగా ఈ పేలుడులో పాఠశాల గోడలో కొంత భాగం దెబ్బతినగా, సమీపంలోని దుకాణాలు, కిటికీలు.. పక్కన ఆపిఉన్న కొన్ని కార్లు ధ్వంసమైయ్యాయి. పేలుడు దాటికి.. కొన్ని వందల మీటర్ల వరకు భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.