ED Summons to AAP Minister Kailash(Telugu news headlines today): ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో డొంక కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కవిత తీహార్ జైల్ లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండగా.. కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 1 వరకూ ఆయన ఈడీ కస్టడీలోనే ఉంటారు.
Also Read : స్టూడెంట్కి షాకిచ్చిన ఐటీ.. 46 కోట్లపై నోటీసు.. ఇదెలా?
తాజాగా.. ఢిల్లీ మద్యం కేసుకు లింకై ఉన్న మనీలాండరింగ్ కేసులో మరో ఆప్ మంత్రికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ హోం, రవాణా, న్యాయశాఖ మంత్రి అయిన కైలాష్ గెహ్లాట్ కు శనివారం నోటీసులిచ్చింది. ఈ కేసు విచారణకు ఈరోజే హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. విచారణ సమయంలో ఆయన చెప్పే సమాధానాలను ఈడీ రికార్డ్ చేయనుంది. కైలాష్ గెహ్లాట్ విచారణలో మరింత కీలక సమాచారాన్ని రాబట్టాలని ఈడీ భావిస్తోంది.
కాగా.. కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నా.. ఢిల్లీ సీఎంగా పాలన కొనసాగిస్తున్నారు. దీనిపై ఇటీవలే పిటిషన్ దాఖలవ్వగా.. కేజ్రీవాల్ జైలు నుంచి పాలన కొనసాగిస్తే మీకేం ఇబ్బంది అని సుప్రీంకోర్టు పిటిషన్ దారులకు మొట్టికాయలు వేసింది. తాజాగా ఢిల్లీ హైకోర్టులో సైతం ఆయనను పదవి నుంచి తొలగించాలని మరో పిటిషన్ దాఖలైంది.