Red Fort Blast: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు వెనక ఉగ్ర సంస్థ అల్ ఖైదా హస్తం ఉన్నట్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ (AQIS) సంస్థకు చెందిన వారు ఈ కుట్రను అమలు చేసినట్టుగా తెలిపింది. ఇప్పటికీ చిన్న చిన్న మాడ్యూళ్ల ద్వారా దేశంలో విధ్వంసాలను సృష్టించటానికి కుట్రలు చేస్తున్నట్టుగా వెల్లడించింది. దీనికోసం మరో ఉగ్ర సంస్థ ఐసిస్ (ISIS)తో కలిసి పని చేస్తోందని తెలిపింది.
గతేడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ కారులో పేలుడు పదార్థాలు పెట్టుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ పేలుడులో పదకొండు మందికి పైగా చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై ఎన్ఐఏ విచారణ జరిపి కోర్టుకు ఛార్జ్ షీట్ కూడా సమర్పించింది. తాజాగా ఈ పేలుడు వెనక అల్ ఖైదా ఉగ్ర సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న ఏక్యూఐఎస్ ఉన్నట్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తన నివేదికలో నిర్ధారించింది.
ఏక్యూఐఎస్ సంస్థ డబ్బు ఆశ చూపించి పదుల సంఖ్యలో యువకులను ఉగ్రబాటలోకి నడిపిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల కంట పడకుండా ఉండేందుకు పరిమిత సంఖ్యలో ఉగ్రవాదులతో చిన్న చిన్న మాడ్యూళ్లను ఏర్పాటు చేసి కుట్రలు అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ క్రమంలో లాజిస్టిక్స్, ఆర్థిక నెట్ వర్క్ లను ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలిపాయి.
ఏక్యూఐఎస్ మరో ఉగ్ర సంస్థ ఐఎస్ఐఎస్ తో కలిసి పని చేస్తున్నట్టుగా సమాచారం. ఈ రెండు సంస్థలు కలిసి ప్రమాదకరమైన జీవ రసాయనాలను తయారు చేసి భారీ సంఖ్యలో జనం ప్రాణాలు తీయటానికి పన్నాగాలు చేసినట్టుగా ఇప్పటికే బయటపడింది. ఎర్రకోట పేలుడు కేసులో నిందితునిగా ఉన్న హైదరాబాదీ డాక్టర్ అహమద్ మొహియుద్దీన్ ను అరెస్ట్ చేసినపుడు రాజేంద్రనగర్ ప్రాంతంలోని అతని ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తనిఖీలు జరిపారు. దీంట్లో అహ్మద్ మొహియుద్దీన్ తన ఇంట్లోనే ల్యాబ్ ఏర్పాటు చేసుకుని ఆముదం గింజల నుంచి ‘రైసిన్’ అనే డేంజరస్ జీవ రసాయనాన్ని తయారు చేయటానికి ప్రయోగాలు చేసినట్టుగా వెల్లడైంది.
Also Read: బస్సులో పోయిన రూ.24 వేలు.. 2 ఏళ్ల తర్వాత మళ్లీ చేతికొచ్చాయ్.. కండక్టర్ మామూలోడు కాదు సామీ!
ఇలా తయారు చేసిన రైసిన్ ను నీటి ట్యాంకర్లు, ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో కలిపి ప్రాణాలు తీయాలని కుట్రలు చేసినట్టుగా ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. పోలీసువర్గాలు చెబుతున్న ప్రకారం ఈ రైసిన్ అన్న విషం.. సైనేడ్ కంటే ప్రమాదకరం. ఒక్కసారి శరీరంలోకి వెళితే మనిషి బతకటం అసాధ్యమని వైద్యులు సైతం పేర్కొన్నారు.
Also Read: రూ.30 వేల ఫోన్.. చైనాలో రూ.15 వేలే ఎందుకు? మనం ఎక్కువ ఇస్తున్నామా?