Update on Assembly & Parliament Elections Schedule:
త్వరలో లోక్సభ ఎన్నికల నగారా మోగనుంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు చెక్ పెడుతూ.. మార్చి రెండో వారంలోనే పార్లమెంట్ ఎన్నికలు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టిన ఎలక్షన్ కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతోంది.
త్వరలో లోక్సభ ఎన్నికలతో దేశంలో ఎన్నికల మూడ్ నెలకొంది. ముందుస్తు ఎన్నికలు జరగొచ్చంటూ జోరుగా ప్రచారం సాగింది. ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశముందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే.. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ మార్చి రెండో వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని వెల్లడించాయి ఎలక్షన్ వర్గాలు. అయితే.. గతసారి 2019లో జరిగిన ఎన్నికలకు కూడా మార్చి 10వ తేదీన షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.
Read More : గాలిపై పోటీకి గాలి..? మంత్రి రోజాకు సుడిగాలి..!
ఈ సారి కూడా అదే తరహాలో ఎన్నికలు నిర్వహించేందుకు దృష్టి సారించిన అధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు ఒరిస్సాకు వెళ్లనుండగా.. ఆ తర్వాత బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, యూపీలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన జమ్మూకశ్మీర్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది.
ఇప్పటికే ఏపీలో పర్యటించిన ఈసీ.. అక్కడి పరిస్థితులపై పరిశీలించింది. రాష్ట్రంలో రాజకీయంగా నెలకొన్న సమస్యలను పలు పార్టీల నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు కూడా జరిగే అవకాశం ఉండగా.. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల ఆధారంగా చూస్తే.. ఏపీలో ఈసారి టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి రానుంది. మరోవైపు వైసీపీకి ఫేవర్ గానూ పలు సర్వేలు వెల్లడయ్యాయి.
Read More : తెలంగాణలో కాంగ్రెస్ వాహ.. ఏపీలో టీడీపీ-జనసేన కూటమిదే జోరు..
వైసీపీలో సిట్టింగులకు అధిష్ఠానం మొండిచేయి చూపడంతో.. పార్టీకి పలువురు నేతలు రాజీనామాలు చేసి.. టిడిపి, జనసేన పార్టీల్లో చేరారు. మరికొందరు నేతలు సైతం పక్కచూపులు చూస్తున్నారు. కొందరికి పోటీ స్థానాలను మార్చడం, మరికొందరికి అసలు టిక్కెట్టే ఇవ్వకపోవడంతో అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైకి పార్టీ ఏది చెప్తే అది చేస్తామంటూనే.. తమ అనుచరుల వద్ద పార్టీపై అసంతృప్తిని బయటపెడుతున్నారు. పార్టీకోసం ఎంత సేవచేసినా.. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.