India Army : పాక్ చెరలో బంధిగా ఉన్నా కూడా BSF జవాన్ పూర్ణం కుమార్ షా పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఎంతగా హింస పెట్టినా.. ఇండియన్ ఆర్మీ రహస్యాలు బయటపెట్టలేదు. కళ్లకు గంతలు కట్టి.. మూడు ప్రాంతాలు తిప్పారు. నిద్ర పోకుండా టార్చర్ చేశారు. సైనిక మోహరింపు గురించి గుచ్చి గుచ్చి అడిగారు. అయినా, మన ఆర్మీ జవాను నోరు మెదప లేదు. తానున్నది పాకిస్తాన్ సైనికులు చెరలో అనే విషయం తెలిసి కూడా నోరు జారలేదు. నిజాలు చెప్పకపోతే తనను చంపేస్తారని తెలిసి కూడా.. మాట మాట్లాడలేదు. తన ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు. ఇండియన్ ఆర్మీ గురించి ఒక్క సమాచారం కూడా పాక్కు చెప్పలేదు బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా.
పాక్కు ఎలా చిక్కాడంటే..
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో BSF జనాను పూర్ణం కుమార్ షా అనుకోకుండా సరిహద్దును దాటాడు. LoC వెంట గస్తీ కాస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. కాసేపు రెస్ట్ తీసుకుందామని సమీపంలోని చెట్టు కింద కూర్చు్న్నాడు. అదే అతను చేసిన పొరబాటు. ఆ చెట్టు ఉన్న ప్రాంతం పాకిస్తాన్లోకి వస్తుంది. అంతే, పాక్ సైనికులు వెంటనే షాను అదుపులోకి తీసుకున్నారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. 21 రోజుల పాటు బంధీగా ఉంచుకున్నారు.
కస్టడీలో ఎలా టార్చర్ చేశారంటే..
కస్టడీలో పూర్ణం కుమార్ షాను బాగా ఇబ్బంది పెట్టారు పాకిస్తాన్ జవాన్లు. నిద్ర లేకుండా చేశారు. బూతులు తిట్టేవాళ్లు. పళ్లు తోముకోవడానికి కూడా అనుమతి ఇచ్చేవారు కాదు. తన కళ్లకు గంతలు కట్టి.. మూడు వేరు వేరు చోట్లకు తరలించారని షా చెప్పాడు. ఓ ప్రదేశాన్ని ఎయిర్బేస్గా అంచనా వేశాడు షా. అక్కడ విమానాల శబ్దాలు వినిపించాయన్నాడు. ఆ తర్వాత పూర్ణం కుమార్ షా ను ఓ జైలు గదిలో బంధించి ఉంచారు పాక్ సైనికులు. సివిల్ డ్రెస్సులో ఉన్న పాక్ సైనికాధికారులు.. బోర్డర్లో ఇండియన్ ఆర్మీ యూనిట్స్ డీటైల్స్ చెప్పాలని పూర్ణం కుమార్ షాను తీవ్ర ఒత్తిడి చేశారు. మన ఆర్మీ అధికారుల కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలని బెదిరించారట. అడ్రసులు, ఫోన్ నెంబర్లు కూడా అడిగారట. పాక్ అధికారులు ఎంతగా టార్చర్ చేసినా.. షా మాత్రం వారికి ఎలాంటి డీటైల్స్ ఇవ్వలేదు.
పొగరు చూపించిన పాక్
మరోవైపు, బీఎస్ఎఫ్ జవాన్ షా.. పాక్ ఆర్మీకి చిక్కినప్పటి నుంచి అతని విడుదల కోసం గట్టిగా ప్రయత్నించింది భారత సైన్యం. ఆరుసార్లు పాక్ ఆర్మీతో చర్చలు జరిపారు. మన రిక్వెస్ట్ను వాళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా పొగరు చూపించారు. ఉన్నతాధికారులకు చెప్పాం.. వారి నుంచి అప్డేట్ రాగానే వదిలేస్తాం అని చెప్పారే కానీ.. షాను మాత్రం విడిచిపెట్టలేదు. కావాలనే పాక్ ఆర్మీ డ్రామా చేస్తోందని తెలిసినా.. మనం ఏం చేయలేని పరిస్థితి అప్పుడు. అంతలోనే మరో అనూహ్య పరిణామం జరిగింది. అదే షా ను కాపాడింది.
Also Read : కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
రేంజర్కు బదులు జవాన్
మే నెల మొదటి వారంలో రాజస్థాన్లో బోర్డర్ క్రాస్ చేసి ఇండియా భూభాగంలోకి ప్రవేశించాడు ఓ పాక్ రేంజర్. వెంటనే అతన్ని పట్టేసుకున్నారు మన బీఎస్ఎఫ్ జవాన్లు. దీంతో దెబ్బకు దిగొచ్చింది పాకిస్తాన్. షా ను వదిలేస్తాం, తమ రేంజర్ను వదిలేయమంది. మే 14న పూర్ణం కుమార్ షాను పంజాబ్ అమృత్సర్లోని అటారీ బోర్డర్లో ఇండియన్ ఆర్మీకి అప్పగించారు. బీఎస్ఎఫ్ కూడా తమ కస్టడీలో ఉన్న పాక్ రేంజర్ మహమ్మదుల్లాను రిలీజ్ చేసింది. షా ఉదంతం ఇలా సుఖాంతమైంది.