Terrorist House Explosion| కశ్మీర్ లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో నిందితుమైన ఒక ఉగ్రవాది ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన పుల్వామాలో జరిగింది. భారత సైన్యం, భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా అతని కోసం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఈ పేలుడు సంభవించింది. భారత సైనికులను చంపేందుకే ఆ ఉగ్రవాది ఈ ట్రాప పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పేలుడును ముందే పసిగట్టిన భద్రతా బలగాలు త్రటిలో తమ ప్రాణాలు కాపాడుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. జమ్ము కశ్మీర్ లోని పుల్వామా జిల్లా త్రాల్ పట్టణం మొనఘామా ప్రాంతంలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ ఇల్లు ఉగ్రవాది ఆసిఫ్ షేక్ కు చెందినదిగా స్థానిక పోలీసులు తెలిపారు. ఆసిఫ్ షేక్ మరో ఉగ్రవాది అయిన ఆదిల్ ఠోకార్తో కలిసి పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని. పాకిస్తానీ ఉగ్రవాదుల గ్రూప్ లో ఇతన సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం. 2019లో పుల్వామా ఉగ్రవాద దాడిలో, ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడిలో ఆసిఫ్ షేక్ ప్రమేయం ఉందని తేలడంతో అతని కోసం స్థానిక పోలీసుల సాయంతో భారత సైన్యం, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో త్రాల్ పట్టణంలో అతని ఇల్లు ఉందని తెలిసి అక్కడికి చేరుకున్నారు.
భారీ పేలుడు ఎలా జరిగింది?
స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. పాకిస్తాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరె తైబా లోకల్ కమాండర్ గా ఆసిఫ్ షేక్ వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, భారత సైనికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో త్రాల్ పట్టణంలో అతని ఇల్లు ఉందని తెలిసి అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిచారు. కానీ భద్రతా బలగాలు ఆసిఫ్ షేక్ ఇంట్లోకి వెళ్లినప్పుడు లోపల పేలుడు పదార్థాలు కనిపించాయి. వాటికి వైర్లతో కనెక్షన్ ఉంది. ఇదంతా చూసి ఇది ట్రాప్ గా అనుమానించిన భద్రతా బలగాలు వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. క్షణాల్లోనే ఆసిఫ్ షేక్ ఇల్లు పేలిపోయింది. పేలుడు భారీ స్థాయిలో జరిగినట్లు వీడియో దృశ్యాల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారత సైనికులను హతమార్చేందుకు ఉగ్రవాదులు ఆసిఫ్ షేక్ ఇంట్లో ట్రాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ పేలుడు భారీ స్థాయిలో ఉండడంతో ఎటువంటి పేలుడు పదార్థాలు ఉపయోగించారనే కోణం విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Also Read: ఇండియా vs పాకిస్తాన్.. యుద్ధం జరిగితే.. ఎవరి బలం ఎంత?
మరో ఉగ్రవాది ఇల్లు కూల్చివేత
ఉగ్రవాది ఆసిఫ్ షేక్ తో సన్నిహితుడు అయిన లష్కరె ఉగ్రవాది ఆదిల్ ఠోకార్ అలియాస్ ఆదిల్ గురీ ఇంటిని భారత సైన్యం కూల్చివేసింది. ఈ ఘటన బిజెబేహారాలో జరిగింది. ఆదిల్ ఠోకార్కు కూడా పహల్గాం ఉగ్రవాద దాడితో లింకులున్నాయని పోలీసులు తెలిపారు. బిజ్ బేహారా ప్రాంతానికి చెందిన ఆదిల్ 2018లో పాకిస్తాన్ కు దొంగచాటుగా వెళ్లి అక్కడ ఉగ్రవాదుల స్థావరాల్లో ట్రైనింగ్ పొందాడు. ఆ తరువాత బిజ్ బెహారాకు 2024లో తిరిగి వచ్చి దేశ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందించింది.