Rains for Few states in India: వేసవి తాపం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను తాకడంతో.. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సూరీడి నిప్పుల ముందు.. కూలర్లు, ఏసీలు కూడా చిన్నబోతున్నాయి. ఎంత కూలింగ్ లో ఉన్నా.. వేసవి వేడి తగ్గడం లేదు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ.. ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్టులు జారీ చేశారు.
ఇక పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. తమిళనాడు, రాయలసీమ, ఒడిశా, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ వేడిగాలులు వీస్తాయని అంచనా వేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బయట అడుగుపెట్టిందే పాపం.. ముఖం మాడిపోతోంది. కాళ్లు, చేతులు వేడికి కమిలిపోతున్నాయి.
Also Read: కిల్లర్ సమ్మర్.. బయటకు వెళ్తే ఇక అంతే..
మండుటెండల నుంచి ఉపశమనాన్నిచ్చేలా భారత వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 5 రోజులపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలలో తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పింది. ఇక ఆంధ్ర, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు చెప్పింది.