Kerala MLA Uma Thomas| కేరళకు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కొన్ని రోజుల క్రితం ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె ఆ ఈవెంట్లో స్టేజిపై నుంచి 15 అడుగుల కిందకు పడ్డారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఆమె తలకు గాయాలయ్యాయని, ఆమె శరీరంలో ఎముకలు కూడా విరిగిపోయాయని డాక్టర్లు తెలిపారు. త్రిక్కాకర అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఉమా థామస్ ఊబకాయంతో ఉండడంలో ఆమెకు ఊపిరి తీసుకోవడానికి సమస్యగా మారింది. దీంతో ఆమెను వెంటిలేటర్ పై పెట్టారు.
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 29, 2024 ఆదివారం కేరళ రాష్ట్రం కొచ్చి నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం మృదంగ నాదం 2024 అనే సాంస్కృతిక నృత్య కార్యక్రమం నిర్వహించారు. 12,000 మంది డాన్సర్లు పాల్గొన్న ఈ మెగా డాన్స్ కార్యక్రమానికి పలువురు విఐపీలు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ క్రమంలోనే త్రిక్కాకర్ ఎమ్మెల్యే ఉమా థామస్ కూడా ఆ మెగా డాన్స్ ప్రొగామ్కు అతిథిగా వెళ్లారు.
అయితే డాన్స్ కార్యక్రమంలో స్టేజీ 15 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఎక్కువ మంది డాన్సర్లు మైదానంలో నృత్య కార్యక్రమం చేయనుండడంతో అందరికీ కనిపించే విధంగా అంత ఎత్తులో విఐపీల కోసం స్టేజీ నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాన్స్ ప్రొగ్రామ్ కు ముందు స్టేజీపై అతిథులు కూర్చోవడానికి కుర్చీలు పెట్టారు. అయితే స్టేజీపై కుర్చీలకు కేవలం ఒక అడుగు దూరంలోనే టెంపరరీ రిబ్బన్ బ్యారికేడ్స్ పెట్టారు. వాటిని దాటితే స్టేజి నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉంది.
Also Read: బుర్కా ధరించకపోతే విడాకులు.. అలా కుదరదన్న హై కోర్టు
ఈ క్రమంలో ఎమ్మెల్యే ఉమా థామస్ స్టేజీ వెనుక నుంచి వచ్చారు. ఆ సమయంలో ఆమె పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు సోషల్ మీడియా వీడియోల్లో కనిపిస్తోంది. అయితే ఆమె వెనుక నుంచి వచ్చి ముందు వరుసలో ఉన్న కుర్చీపై కూర్చొన్నారు. ఇంతలో ఆమెకు రెండు కుర్చీల పక్కన మరో విఐపి రాష్ట్ర మంత్రి షాజీ చెరియన్ వచ్చి కూర్చోవడం చూసి ఆమె లేచి ఆయనకు అభివాదం చేసేందుకు ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న రిబ్బన్ బ్యారికేడ్ల వైపు అనుకోకుండా జరిగింది. దీంతో ఆమె కాలు జారి స్టేజీ మీద నుంచి కిందపడింది. పడిపోయే క్రమంలో ఆమె రిబ్బన్ బ్యారికేడ్లను పట్టుకున్నారు. దీంతో బ్యారికేడ్లన్నీ ఆమెతో పాటే కిందపడ్డాయి. ఆ బ్యారికేడ్లు పక్కాగా లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కనిపిస్తోంది. పైగా స్టేజీకి ఒక్క అడుగు దూరంలోనే అతిథులకు కూర్చోబెట్టడం, పైగా ఆ స్టేజీ 15 అడుగల ఎత్తులో నిర్మించడం ఈ ప్రమాదానికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది.
స్టేజి కింద అంతా కాంక్రీట్ ఫ్లోర్ ఉండడంతో ఎమ్మెల్యే ఉమా థామస్ కు బలంగా గాయాలయ్యాయి. ఆమె కింద పడే సమయంలో తలకు బలంగా గాయమైంది. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని రెనాయి మెడిసిటీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమె పరిస్థితి పరిశీలించి.. ఐసియులోకి అడ్మిట్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన ఈవెంట్ నిర్వహకులు మృదంగ విజన్ టీమ్ పై పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం.. నిర్లక్ష్యం వలన ప్రాణాపాయ స్థితి కల్పించినందుకు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఆస్పత్రిలో డాక్టర్లు ఎమ్మెల్యే ఉమా థామస్ కు వెంటిలేటర్ పై పెట్టారు. గత అయిదు రోజులుగా ఆమె క్రమంగా కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. అయితే ఇంకా ఆమె ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదని తెలిసింది. 2022లో త్రిక్కాకర అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే పి టి థామస్ మృతి చెందడంతో ఆయన భార్య ఉమా థామస్ ఉపఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.