Kunal Kamra Shiv Sena : శిందే శివసేన కార్యకర్తలు ముంబై నగరంలోని హబిటాట్ స్టూడియోను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా.. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన స్టూడియోను శిందే శివసేనకు చెందిన కొంతమంది ఎలా ధ్వంసం చేశారో చూపిస్తూ వారిపై వ్యంగ్యంగా ఒక పాట పాడారు. దీన్నంతా రికార్డ్ చేసి తన యూట్యూబ్ చానల్లో వీడియోను పోస్ట్ చేశారు. ఈ చర్యకు ప్రతి చర్య ఉంటుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిందే వ్యాఖ్యానించిన తర్వాత కునాల్ కమ్రా ఈ వీడియోను ప్రజల్లోకి తీసుకురావడం గమనార్హం.
కునాల్ కమ్రా స్టాండప్ కామెడీ షోలు చేసే ముంబైలోని హాబిటాట్ స్టూడియోపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ఆ తరువాత మునిసిపల్ అధికారులు హోటల్ లోని కొంత భాగం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ఒక శివసేన పార్టీకి చెందిన వ్యక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్టూడియోపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేపై కమ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శివసేన కార్యకర్తలు స్టూడియోపై దాడిచేయడం, ఆ తరువాత ముందస్తు నోటీసు లేకుండా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు పాల్పడింది. దాడి చేసినందుకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, శిందే గురించి హాస్యాస్పదంగా చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. సమన్లు జారీ చేశారు.
Also Read: నోటిసులిచ్చిన వెంటనే ఇళ్లు కూల్చేస్తారా?.. యోగి ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
500 బెదిరింపు కాల్స్ వచ్చాయి: కునాల్ కామ్రా
వివాదం జరుగుతుండగా.. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే గురించి మరోసారి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షమైన బిజేపీకి కూడా శిందే అంటే ఇష్టం లేదని భావిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. “నా వ్యాఖ్యలకు స్పందించిన కొందరు నన్న బెదిరిస్తున్నారు. ఈ వివాదం తరువాత 500 పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. నన్ను ముక్కలుగా నరికేస్తామంటూ బెదిరిస్తున్నారు. వారంతా శివసేన పార్టీకి చెందిన వారే” అంటూ ఆరోపించారు.
ఈ ఘటన తర్వాత స్పందించిన కునాల్.. తనకు గుణపాఠం చెబుతానని రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ కేవలం ధనవంతులు, శక్తివంతులైన వారికి మాత్రమే కాదని తెలిపారు. తనపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా పోలీసులకు, కోర్టులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
2 నిమిషాల ఫేమ్ కోసమే చేశాడు.. కమ్రాను విమర్శించిన కంగనా
స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా వివాదంపై బిజేపీ ఎంపీ, బాలివుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. కేవలం 2 నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం ఆలోచించాలన్నారు. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
“కేవలం 2 నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం ఆలోచించాలి. మాట్లాడింది ఎవరైనా కావచ్చు. కానీ, ఒకరిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం, వారి పరువుకు భంగం కలిగించేలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదు. విమర్శించాలనుకుంటే సాహిత్య ప్రక్రియ ద్వారా ఆ పని చేయవచ్చు. కానీ, కామెడీ అనే పేరుతో మన సంస్కృతిని, ప్రజలను దూషిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి ఆ వేదికను కూల్చడం చట్టబద్ధంగానే జరిగింది. కానీ, నా విషయంలో మాత్రం చట్టవిరుద్ధంగానే జరిగింది” అని కంగనా పేర్కొన్నారు.