Wrongful Arrest Karnataka| పోలీసుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ఒక వ్యక్తి జీవితం నాశనమైంది. అతడు హంతకుడని పోలీసులు జైల్లో పెట్టగా.. అతని కుటుంబం, పిల్లలు, బంధువులంతా అతడిని సామాజికంగా బహిష్కరించారు. రెండేళ్ల తరువాత అసలు చనిపోయిన వ్యక్తి బతికే ఉన్నారని తెలియడంతో అందరూ షాకైపోయారు. ఇప్పుడు పోలీసుల చేతిలో బలైపోయిన ఆ అమాయక పౌరుడు కోర్టు లో దావా వేశాడు. తనకు రూ.5 కోట్లు నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టును కోరాడు. పోలీసులు తప్పు చేశారు కాబట్టి వారిని శిక్షించాలని వాదించాడు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఒక గిరిజన వ్యక్తి, తన భార్య హత్య కేసులో దాదాపు రెండేళ్లు జైలులో గడిపిన తర్వాత, ఆమె బతికే ఉన్నట్లు తేలడంతో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, రూ. 5 కోట్ల పరిహారం చెల్లించాలని అతను కోరుతున్నాడు.
కుశాలనగర్ తాలూకులోని బసవనహళ్లికి చెందిన కురుబర సురేష్, 2025 ఏప్రిల్లో మైసూరులోని 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు అతడిని హత్య కేసులో నిర్దోషిగా తీర్పు చెబుతూ విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కోర్టు కర్ణాటక హోం డిపార్ట్మెంట్ను అతనికి రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కానీ, ఇంత తక్కువ పరిహారం, పోలీసుల బాధ్యత గురించి అసంతృప్తి చెందిన సురేష్ ఇప్పుడు హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశాడు.
సురేష్ తన పిటిషన్లో ఐదుగురు పోలీసు అధికారులను పేర్కొన్నాడు. అప్పటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ బిజి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్, సబ్-ఇన్స్పెక్టర్లు ప్రకాశ్ యత్తిమణి, మహేష్ బికె, మరియు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ సోమశేఖర. వారు అబద్ధపు సాక్ష్యాలను సృష్టించి, తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి, సరైన ప్రక్రియ లేకుండా తనను అరెస్ట్ చేశారని ఆరోపించాడు. సురేష్ ఆర్థిక పరిహారంతో పాటు వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.
ఈ కేసు 2021లో ప్రారంభమైంది. సురేష్ భార్య మల్లిగె అదృశ్యమైన తర్వాత అతను మిస్సింగ్ కంప్లైంట్ దాఖలు చేశాడు. 2022లో, పక్కనే ఉన్న మైసూరు జిల్లాలోని బెట్టదపుర పోలీసు స్టేషన్ పరిధిలో ఒక మహిళ శవం ఎముకలు అంటే అస్థిపంజరం కనుగొనబడింది. సరైన గుర్తింపు లేకపోయినా.. డిఎన్ఏ పరీక్షలు నిర్వహించకుండానే పోలీసులు ఆ అస్థిపంజరం మల్లిగెదని సందేహించారు. DNA పరీక్ష లేకుండానే.. ఆ శవం తన భార్యదేనని ఒప్పుకోవాలంటూ సురేష్ ని ఒత్తగి చేశారు. చనిపోయిన మల్లిగె తల్లిని కూడా అదే ఆమె కూతురు శమని ధృవీకరించమని ఒత్తిడి చేశారు. దీని ఆధారంగా సురేష్ను హత్య ఆరోపణలతో అరెస్ట్ చేశారు. అతను దాదాపు 18 నెలలు జైలులో ఉన్నాడు.
కోర్టు ఆదేశంతో డిఎన్ఏ పరీక్ష చేయించగా, ఆ అస్థిపంజరం మల్లిగెది కాదని తేలింది. దీంతో సురేష్కు బెయిల్ పై విడుదలయ్యాడు. ఇదే సమయంలో సురేష్ ని అతని పిల్లలు, అతని బంధువులంతా హంతకుడిగా ముద్ర వేసి బహిష్కరించార. అతడిని అవమానించారు.
అయితే మరో షాకింగ్ ఘటన జరిగింది. 2025 ఏప్రిల్లో.. సురేష్ స్నేహితులు మల్లిగెను మదికేరిలోని ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా చూశారు. ఆమెను బెట్టదపుర పోలీసులు అదుపులోకి తీసుకొని మైసూరు కోర్టులో హాజరుపరిచారు. ఆమె బతికే ఉండటం పోలీసు విచారణలో తీవ్రమైన లోపాలను, సాక్ష్యాల నిర్వహణలో జాగ్రత్తలేని తనాన్ని, లేదా ఉద్దేశపూర్వక తప్పిదాన్ని లేవనెత్తింది.
సెషన్స్ కోర్టు ఇన్స్పెక్టర్ ప్రకాశ్ బిజిపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించినందుకు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. కానీ సురేష్ తన అప్పీల్లో ఐదుగురు అధికారులపైనా క్రిమినల్ బాధ్యత విధించాలని కోరాడు. తనను “నిందితుడు”గా కాకుండా “బాధితుడు”గా పేర్కొనాలని కోర్టును కోరాడు. మల్లిగె గత మూడేళ్లలో ఎక్కడ ఉంది, ఆమె అదృశ్యం వెనుక ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతోంది. మల్లిగె తన ప్రియుడితో ఇంతకాలం ఉన్నదని.. సురేష్, అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.