Mehbooba Mufti Bangladesh| బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులను అక్కడి ప్రభుత్వం వేధిస్తుంటే.. భారతదేశంలో మైనారిటీలైన ముస్లింలను వేధింపులకు గురి చేస్తున్నారు అని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) అధ్యక్షురాలు మెహ్బూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 24న ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ ప్రాంతంలో జరిగిన హింసను బాధాకరమని వర్ణిస్తూ ఆమె బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం రాత్రి జమ్మూలో మెహ్బూబా ముఫ్తీ మీడియా రిపోర్టర్లతో ఆమె మాట్లాడుతూ.. “1947 సంవత్సరంలో కూడా ఇలాగే జరిగింది. హిందువులు, ముస్లింల మధ్య జరిగిన హింస నరమేధంగా మారింది. ఇప్పుడు కూడా అదే దిశలో దేశం వెళుతోంది. యువత ఉద్యోగాల గురించి మాట్లాడితే అది వారికి దక్కదు. దేశంలో ఉన్న ఆస్పత్రులు, విద్యాసంస్థలు, రోడ్లు లాంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయకుండా.. వాటి గురించి ఎవరూ మాట్లాడకుండా ఉండేందుకు ఇప్పుడు మసీదులను ధ్వంసం చేస్తున్నారు. వాటి కింద దేవాలయాలు ఉన్నాయంటూ రెచ్చగొడుతున్నారు. సంభల్లో జరిగిన హింసాత్మక ఘటనలు చాలా బాధాకరం, దురదృష్టకరం. ఏ తప్పు చేయని వారిని కూడా కాల్చి చంపారు. మసీదు సమీపంలోని షాపుల్లో పనిచేసుకుంటున్నా వారిపై కూడా కాల్పులు జరిపారు.” అని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ ప్రాంతంలోని మొఘల్ సామ్రాజ్య సమయంలో నిర్మించిన షాహి జామా మసీదు కింద శివాలయం ఆనవాళ్లున్నాయని స్థానిక కోర్టులో పిటీషన్ వేయగా.. కోర్టు మసీదు కమిటీ సభ్యులు లేకుండా విచారణ ప్రారంభించి.. పురావస్తు శాఖకు మసీదులో సర్వే చేయమని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన మూడు గంటల్లోనే పురావస్తు శాఖ మసీదులో సర్వే చేపట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మసీదుని కూల్చడానికే సర్వే జరుగుతోందని సంభల్ లో ప్రచరాం జరగడంతో ఆ ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు.
Also Read: ప్రియాంక గెలిస్తే ఆవుని కాల్చి చంపారు?!.. హిందూ మతగురువు వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ కాల్పుల్లో నలుగురు చనిపోగా.. చాలా మందికి గాయాలయ్యాయి. మసీదు కమిటీకి విచారణ పిలవకుండానే కోర్టు సర్వేకి ఆదేశాలు జారీ చేయడం. ఆదేశాలు అందిన కొన్ని గంటల్లోనే పురావస్తు శాఖ అధికారులు ఎటువంటి భద్రత చర్యలు చేపట్టకుండా సర్వే చేపట్టడంతో ఇప్పుడు సంభల్ పరిపాలన విభాగం, ఉత్తర్ ప్రభుత్వంపై రాజకీయ పార్టీలు విమర్శుల చేస్తున్నాయి. సంభల్ లో జరిగిన హింసపై చివరికి సుప్రీం కోర్టు కలుగజేసుకొని స్థానిక కోర్టు మసీదు సర్వే కేసు విచారణ చేయకూడదని ఆదేశిస్తూ.. హై కోర్టులో ఈ కేసు విచారణ జరగాలని నిర్దేశించింది.
ఈ అంశాన్నింటినీ మెహ్బూబా ముఫ్తీ ప్రస్తావించారు. వీటితో పాటు హిందువులు సైతం పవిత్ర స్థానంగా కొలిచే అజ్మేర్ దర్గాని కూడా రాజకీయాల్లో కి లాగారని ఆమె తప్పుబట్టారు. “ఇప్పుడు అజ్మేర్ దర్గా కింద కూడా తవ్వి అక్కడ కూడా గుడి ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటనలన్నీ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసకు ఏమాత్రం తీసిపోవు. అక్కడ మైనారిటీలైన హిందువులను ఇలాగే వేధిస్తున్నారు. బంగ్లాదేశ్ లో మైనారిటీలను వేధిస్తుంటే ఇండియాలో కూడా అదే జరుగుతోంది. బంగ్లాదేశ్ కు, ఇండియాకు మధ్య ఏం తేడా ఉందని? నాకైతే ఏ తేడా కనిపించడం లేదు.” అని మెహ్బూబా ముఫ్తీ అన్నారు.
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులు, హిందూ దేవాలయాలపై గత కొన్ని నెలలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులకు నిరసనగా వారం రోజుల క్రితం ఇస్కాన్ గుడి పూజారి చిన్మోయి కృష్ణదాస్ ఆయన అనుచరులతో భారీ ర్యాలీ నిర్విహించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన లాయర్ సైఫుల్ ఇస్లాం ని హత్య చేశారు.