NIA Raids in Chennai for Bengaluru Cafe Blast Suspects: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం ఉదయం చెన్నైలోని మూడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి 1న పేలుడు ఘటనలో ఇద్దరు అనుమానితులు చెన్నైలో మకాం వేసినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో దాడులు ప్రారంభించారు.
ఇప్పటికే కీలక నిందితుడిని గుర్తించిన కేంద్ర ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థ అతడి ఆచూకీ కోసం గాలిస్తోంది. నిందితులు క్యాప్, మాస్క్ ధరించి ఉన్న విషయం తెలిసిందే.
మార్చి 23న.. కర్ణాటకలోని తీర్థహళ్లి జిల్లా శివమొగ్గకు చెందిన కీలక నిందితుడు ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్ను గుర్తించినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ప్రధాన నిందితుడిని గుర్తించేందుకు ఏజెన్సీ 1,000 సీసీటీవీ కెమెరాలను పరిశీలించింది.
పేలుడు వెనుక శివమొగ్గ ఐఎస్ఐఎస్ మాడ్యూల్ హస్తం ఉండొచ్చని దర్యాప్తు సంస్థ వర్గాలు ముందుగా తెలిపాయి. అధికారుల సమాచారం ప్రకారం.. ఈ మాడ్యూల్కు చెందిన 11 మంది కర్ణాటకలోని తీర్థహళ్లిలో రాడికల్గా మారారు. ఆ తర్వాత వారు గత కొన్నేళ్లుగా దక్షిణ భారతదేశంలో తమ నెట్వర్క్ను విస్తరించారు.
Also Read: ఫ్యామిలీలో చిచ్చురేపిన ఐపీఎల్ బెట్టింగ్, ఉమెన్ సూసైడ్.. ఎలా జరిగింది?
బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారం అందించిన వారికి ఎన్ఐఏ రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించింది. అనుమానితుడి సీసీటీవీ చిత్రాలు, వీడియోలను కూడా విడుదల చేసింది. మార్చి నెల ప్రారంభంలో కర్ణాటక హోం మంత్రి గంగాధరయ్య పరమేశ్వర ఈ ఘటనపై మాట్లాడుతూ దర్యాప్తు బృందాలు నిందితులపై ఫోకస్ పెట్టాయని తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.