Central Govt: మన కళ్లముందు ఏదైనా ప్రమాదం జరిగిందా? చాలా వరకు మనకెందుకులే లేనిపోని సమస్యలు అనుకుంటూ.. అలా వెళ్లిపోతూ ఉంటాం. అయితే సరైన సమయంలో ప్రమాదం జరిగిన వ్యక్తిని వైద్యశాలకు తరలిస్తే, ఆ ప్రాణాన్ని రక్షించవచ్చు. కానీ పోలీసుల ప్రశ్నలు మనల్ని వేధిస్తాయన్న భయం మనలో ఉండడం సహజం. అయితే ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలిస్తే సేవతో పాటు, మనకు సాయం కూడా అందనుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని తొలి గంటలోగా వైద్యశాలకు చేరిస్తే ప్రత్యేకమైన రివార్డును అందించేందుకు కేంద్రం ముందడుగు వేసింది.
ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై గాయాలతో ఉన్నవారిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో సాయం చేసే సేవాగుణం కలిగిన వారు ఎందరో మన దేశంలో ఉన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రమాదాల సమయంలో సాయాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటిచెబుతున్నాయి.
అంతేకాకుండా ఆ రహదారి వెంట వెళ్లే వాహనదారులు సైతం, స్పందించి వైద్యశాలకు తరలించడమో లేక 108 వాహనానికి సమాచారం అందించడమో జరుగుతుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గంటలోగా వైద్యశాలకు తరలించే వ్యవధిని సాధారణంగా గోల్డెన్ అవర్ అంటారు. అంటే గంట వ్యవధిలో ఎంత పెను ప్రమాదంలో గాయాలపాలైనా, వారిని వైద్యులు కాపాడగలిగే స్థితి ఉంటుంది. అందుకే ఆ తొలి గంటను గోల్డెన్ అవర్ అంటారు.
ప్రమాదంలో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ సమయంలో వైద్యశాలకు తరలించిన వారిని కేంద్రం ఉత్తమ పౌరులుగా గుర్తిస్తుంది. ప్రస్తుతం ఇలా సేవలందించిన వారికి రూ. 5000 అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఆ మొత్తాన్ని తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఇచ్చే రూ. 5వేలను రూ. 25 వేలకు పెంచుతున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనతో రహదారి ప్రమాదాలకు గురైన వారికి సాయం అందించేందుకు మానవతావాదులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారన్న భావన కేంద్రం వ్యక్తం చేస్తోంది.
Also Read: Ghewar Sweet: ఆ జిల్లాలో సంక్రాంతి స్పెషల్ ఫేవరేట్.. ఈ స్వీట్..
ప్రమాదం జరిగిన వారిని రక్షించడమే లక్ష్యంగా కేంద్రం గోల్డెన్ అవర్ నగదును పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. మీ కళ్ల ముందు ప్రమాదం జరిగిందా.. వెంటనే సాయం అందించండి.. రూ. 25 వేల నగదును ఉత్తమ పౌరుడిగా గుర్తింపు పొంది ఆర్థిక ప్రోత్సాహం పొందండి.