BSF FILTHY TRAIN| విధులు నిర్వర్తిస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ల ప్రయాణానికి రైల్వే శాఖ చేసిన చెత్త ఏర్పాట్లు ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది. త్రిపుర నుంచి అమర్ నాథ్ యాత్ర సెక్యూరిటీ కోసం వెళుతున్న బిఎస్ఎఫ్ జవాన్లను మురికి, పాత రైలు కోచ్లలో అధికారులు పంపిన ఘటనపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగింది. ఈ రైలు దయనీయ స్థితిని చూపిస్తూ.. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం స్పందిస్తూ.. నలుగురు రైల్వే అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో.. భద్రతా దళాలు భారత దేశ గౌరవం. ఈ గౌరవంపై రాజీపడేది లేదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, త్రిపురాలోని ఉదయ్పూర్ స్టేషన్ (UDPU) నుంచి బీఎస్ఎఫ్ జవాన్ల కోసం కొత్త రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు బుధవారం రాత్రి 9 గంటలకు ఉదయ్పూర్ నుంచి బయల్దేరుతుందని సమాచారం.
భద్రతా దళాల గౌరవం అత్యంత ముఖ్యం: రైల్వే మంత్రి
అలిపుర్ద్వార్ రైల్ డివిజన్కు చెందిన ముగ్గురు సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు, ఒక కోచింగ్ డిపో అధికారిని రైల్వే మంత్రి సస్పెండ్ చేశారు. “భద్రతా దళాల గౌరవం అత్యంత ముఖ్యం. ఇటువంటి నిర్లక్ష్యాన్ని ఏ స్థాయిలోనూ సహించబోము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విచారణ జరుగుతుంది,” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. జవాన్ల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
బీఎస్ఎఫ్ జవాన్లు రైలు స్థితిపై ఫిర్యాదు
సుమారు 13 కంపెనీలకు చెందిన 1,200 మంది బీఎస్ఎఫ్ జవాన్లు.. జూన్ 6న త్రిపురాలోని ఉదయ్పూర్ నుంచి జమ్మూ తావీకి ప్రత్యేక రైలులో బయల్దేరాల్సి ఉంది. ఈ రైలు త్రిపురా, అస్సాం, పశ్చిమ బెంగాల్లోని నాలుగు ప్రాంతాల్లో ఆగి జవాన్లను ఎక్కించుకోవాలి. జూన్ 9న రైలు అందుబాటులోకి రాగా.. దాని “మురికి, అపరిశుభ్ర” స్థితిని చూసిన జవాన్లు వీడియోలు తీశారు. ఈ జవాన్లు జూలై 3 నుంచి జమ్మూ కాశ్మీర్లో జరిగే అమర్నాథ్ యాత్ర కోసం కేంద్రం పంపిన అదనపు భద్రతా దళంలో భాగం.
Also Read: మతాంతర వివాహాల కేసులో సుప్రీం కోర్టు సీరియస్.. రాష్ట్ర ప్రభుత్వాలకు వార్నింగ్
అమర్నాథ్ యాత్ర 2025
అమర్నాథ్ యాత్ర 38 రోజుల పాటు జరుగుతుంది. ఆగస్టు 9న యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర కోసం కేంద్రం.. 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (CAPF), సుమారు 42,000 మంది సిబ్బందిని మోహరించింది. గతంలో ఈ యాత్రపై ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇటీవలే ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పర్యాటకులు మరణించిన ఉగ్రదాడి తర్వాత ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.