Interfaith Marriages| ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు వివాహం చేసుకుంటే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు వారి పట్ల కఠిన వైఖరితో వ్యవహరిస్తున్నాయి. దీని కోసం కొన్ని హిందో బెల్ట్ రాష్ట్రాలు ఏకంగా చట్టాలు రూపొందించాయి. మతాంతర వివాహాలను అడ్డుకోవడమే ఉద్దేశంగా ఈ చట్టాలు రూపొందాయి. అయితే సుప్రీం కోర్టు ఇటీవల ఒక కీలక తీర్పు వెలువరించింది. ఇద్దరు మైనర్ తీరిన వ్యక్తులు ఇష్టపూర్వకంగా చేసుకున్న మతాంతర వివాహాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. హై కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈ తీర్పు ఉండడం గమనార్హం.
ఓ మతాంతర వివాహం కేసులో ఏ తప్పు చేయని ఒక వ్యక్తిని ఆరు నెలలుగా జైలులో నిర్బంధించడం ఏంటని ప్రశ్నించింది. ఒక హిందూ మహిళను వివాహం చేసుకున్నందుకు దాదాపు ఆరు నెలలు జైలులో ఉన్న ముస్లిం వ్యక్తికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు ఈ కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టు సదరు ముస్లిం వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. హై కోర్టు తీర్పును రద్దు చేస్తూ.. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వివాహం ఇరు కుటుంబాల అనుమతితో జరిగింది. వివాహం జరిగిన మరుసటి రోజే ముస్లిం అయిన సదరు భర్త ఒక అఫిడవిట్ సమర్పించాడు. తన భార్యను మతం మార్చుకోవాలని ఏ విధంగా బలవంతం చేయనని, ఆమె తన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించవచ్చని ఆ అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఇంట్లో తల్లిదండ్రుల అనుమతితోనే జరిగిన వివాహానికి.. కొన్ని హిందూ అతివాద సంస్థలు, వ్యక్తులు ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి సదరు ముస్లిం వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో జస్టిస్ బీ వీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. ఈ దంపతులు తమ కుటుంబాల ఇష్టంతో వివాహం చేసుకున్నందున, వారు కలిసి జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం చెప్పకూడదని పేర్కొంది. “ఈ పరిస్థితుల్లో, ఈ వ్యక్తికి బెయిల్ మంజూరు చేయడం తగిన చర్య. క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ, ఈ దంపతులు తమ ఇష్టప్రకారం కలిసి జీవించడానికి ఎటువంటి అడ్డంకి ఉండకూడదు,” అని కోర్టు జారీ చేసిన ఆదేశంలో తెలిపింది.
ఈ వ్యక్తి ఉత్తరాఖండ్ హైకోర్టు ఫిబ్రవరి 2025లో బెయిల్ నిరాకరించడంతో సుప్రీం కోర్టులో అప్పీల్ చేశాడు. అతనిపై ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ యాక్ట్ 2018, భారతీయ న్యాయ సంహిత 2023 చట్టాల ప్రకారం.. తన మత గుర్తింపును దాచి, మోసపూరితంగా హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
అయితే నిందితుడు లాయర్ వాదిస్తూ.. ఈ ఫిర్యాదు కేవలం వేరే మతాన్ని అనుసరించే మహిళను వివాహం చేసుకున్నందుకే దాఖలు చేయబడిందని, ఈ వివాహం ఇరు కుటుంబాల సమ్మతితో జరిగిందని కోర్టుకు విన్నవించారు. వివాహం తర్వాత కొందరు వ్యక్తులు, కొన్ని మత అతివాద సంస్థలు దీన్ని వ్యతిరేకించడంతో డిసెంబర్ 2024లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాదాపు ఆరు నెలలుగా అతను జైలులో ఉన్నాడని, ఛార్జ్షీట్ దాఖలు చేయబడిందని, బెయిల్ మంజూరు చేయాలని లాయర్ కోరారు.
బెయిల్ లభిస్తే.. ఈ దంపతులు తమ కుటుంబాలకు దూరంగా శాంతియుతంగా జీవించవచ్చని లాయర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లాయర్ ఈ అప్పీల్లో ఎటువంటి పురోగతి లేదని, దీన్ని కొట్టివేయాలని వాదించారు. అయినప్పటికీ, సుప్రీం కోర్టు అతని అప్పీల్ను అనుమతించి, వీలైనంత త్వరగా అతడిని ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని, బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది.
విచారణ సమయంలో నిందితుడు సహకరించాలని, బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయబడుతుందని కోర్టు హెచ్చరించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు గతంలో అతని మత విషయాలు మహిళ కుటుంబానికి తెలియజేయలేదని బెయిల్ నిరాకరించింది. అయితే, అతని తల్లి హిందూ మతాన్ని అనుసరిస్తుందని, అతను హిందూ వాతావరణంలో పెరిగాడని లాయర్ వాదించినప్పటికీ, హైకోర్టు ఒప్పుకోలేదు.
Also Read: పాకిస్తాన్ని ప్రశంసించిన అమెరికా.. ఇద్దరూ కలిసి ఉగ్రవాద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారట!
కానీ సుప్రీం కోర్టు అతని బెయిల్ మంజూర్ చేస్తూ.. ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకొని, కలిసి జీవిస్తుంటే వారి విషయంలో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని.. అలా చేస్తే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.