PM Modi Mauritius Highest Civilian Honour| భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి మారిషస్ (Mauritius) అత్యున్నత పురస్కారం లభించింది. ఆ దేశ ప్రధాని నవీన్ రామ్గులాం (Navinchandra Ramgoolam) మోదీకి ‘‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’’ అనే అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. ఈ గౌరవాన్ని పొందిన తొలి భారత ప్రధానిగా మోదీ ఘనత సాధించారు.
ప్రస్తుతం మారిషస్ పర్యటనలో ఉన్న మోదీ.. ఆ దేశ ప్రధాని నవీన్చంద్ర రామ్గులాం, ఆయన సతీమణి వీణా రామ్గులాంలకు ‘ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)’ కార్డులు అందజేశారు. పర్యటనలో భాగంగా.. అక్కడున్న భారతీయులతో మోదీ సమావేశమయ్యారు.
Also Read: మహిళలు ఒక హత్య చేసినా శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్య
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున మారిషస్కి వచ్చాను. అప్పుడు మరో పది రోజుల్లో హోలీ పండుగ ఉంది. అయితే ఈ సారి హోలీ రంగులను నాతో పాటు భారత్కు తీసుకెళ్తున్నాను. ఈ ప్రాంతానికి వస్తే నా సొంత ప్రదేశంలా అనుభూతి కలుగుతుంది. మనమంతా ఒకే కుటుంబం’’ అని ప్రసంగించారు. తనను అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన మారిషస్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారంతో కలిపి ప్రధాని మోదీకి మొత్తం 21 విదేశీ పురస్కారాలు లభించాయి.
మారిషస్ అధ్యక్షుడికి మోదీ ప్రత్యేక కానుక
మారిషస్లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశాధ్యక్షుడు ధరమ్ గోకుల్తో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ (PM Modi) ప్రెసిడెంట్ గోకుల్ కు ఓ అరుదైన కానుకను అందజేశారు. ఇటీవల జరిగిన మహా కుంభమేళా (Kumbh Mela) త్రివేణి సంగమం నుంచి తీసుకువచ్చిన పవిత్ర గంగాజలాన్ని (Gangajal) అందించారు. దీంతో పాటు అనేక బహుమతులను కూడా అందజేశారు. అనంతరం.. అధ్యక్షుడు ఇచ్చిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు.
మారిషస్లో మొక్కలు నాటిన మోదీ
మారిషస్ (Mauritius) ప్రధాని నవీన్ రామ్గోలంతో కలిసి, ఆ దేశ జాతిపిత సీవోసాగర్ రామ్గోలం పేరుతో ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్ను సందర్శించారు. అక్కడ ఇద్దరు ప్రధానులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంలో తీసిన ఫొటోను భారత ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరిట మొక్క) కార్యక్రమంలో నా మిత్రుడు నవీన్ కూడా పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి, మాతృత్వం, స్థిరత్వానికి గుర్తుగా ఈ మొక్క నిలుస్తుంది’’ అని రాసుకున్నారు.
భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని ఈ వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. భూమాతను రక్షించడం కోసం అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఈ ఉదయం మారిషస్ చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.